అప్పుడు దోచుకుని.. ఇప్పుడు విమర్శలా: జగన్‌పై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్

by srinivas |   ( Updated:2024-10-19 11:12:06.0  )
అప్పుడు దోచుకుని.. ఇప్పుడు విమర్శలా: జగన్‌పై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో అమలవుతున్న మద్యం విధానంపై వైఎస్ జగన్(Ys Jagan), వైసీపీ నేతలు విమర్శలు చేయడంపై మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో మద్యం, ఇసుక(Alcohol, Sand)పై వచ్చిన ఆదాయాన్ని దోచుకుని ఇప్పుడు సక్రమంగా అమలువుతున్న విధానాలపై విమర్శలు చేయడం హాస్యాస్పదమని ఆయన కౌంటర్ ఇచ్చారు. గత ఐదేళ్లలో ఎక్సైజ్ శాఖ(Excise Department)ను నిర్వీర్యం చేసింది తమరు కాదా అని ప్రశ్నించారు. సెబ్ పేరుతో అక్రమ మద్యం వ్యాపారం చేయలేదా అని నిలదీశారు. మద్యం తయారీ నుంచి రిటైల్ అమ్మకాల వరకూ అన్ని వ్యవస్థలను తమరు గుప్పిట్లో పెట్టుకోలేదా అని వ్యాఖ్యానించారు. జగన్ అమ్మిన కల్తీ మద్యం తాగి రాష్ట్రంలో 50 లక్షల మంది కిడ్నీ, లివర్ సమస్యలతో బాధపడుతున్నారని కొల్లు రవీంద్ర ఆరోపించారు.

ప్రభుత్వ మద్యం షాపుల్లో వేలాది ఎమ్మార్పీ ఉల్లంఘనలు జరిగాయని, వాటిపై ఏం సమాధానం చెబుతారని మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. 2019-24 మధ్య భారీగా మద్యం రవాణా కేసులు నమోదు కాలేదా అని నిలదీశారు. పక్క రాష్ట్రాల్లో పోలిస్తే ఏపీలో ఎందుకు అంత ఆదాయం తేడా వచ్చిందన్నారు. ఇందుకు తమరు సమాధానం చెబుతారా అని వ్యాఖ్యానించారు. పొరుగు రాష్ట్రాల్లో ఉన్న, దేశ వ్యాప్తంగా ఉన్న మద్యం బ్రాండ్లను ఏపీలో అందుబాటులో ఉంచామని కొల్లు రవీంద్ర తెలిపారు. రూ.99‌కే క్వార్టర్ మద్యాన్ని త్వరలోనే అందిస్తామని, అందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తోందని స్పష్టం చేశారు. రిటైర్డ్ జడ్జితో టెండర్ కమిటీ వేసి మద్యం ధరలను నిర్ణయిస్తామని తెలిపారు. నీతులు చెప్పడం మాని... గత ఐదేళ్లలో జరిగిన మద్యం అక్రమాలపై చర్చకు సిద్ధం కావాలని జగన్‌కు కొల్లు రవీంద్ర సవాల్ విసిరారు.

Advertisement

Next Story