ఆగస్టు 11 నుంచి విశాఖ-తిరుపతి రైళ్ల పునరుద్ధరణ

by srinivas |
ఆగస్టు 11 నుంచి విశాఖ-తిరుపతి రైళ్ల పునరుద్ధరణ
X

దిశ ఏపి బ్యూరో, అమరావతి: కృష్ణాజిల్లా కేంద్రమైన మచిలీపట్నం నుంచి రైల్వే సర్వీసులను పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి తెలిపారు. శనివారం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ఎంపీ బాలశౌరి భేటీ అయ్యారు. ఈ సందర్బంగా పలు అంశాలకు సంబంధించి మంత్రికి వినతి పత్రాలను ఎంపీ అందజేశారు. ఇందులో ప్రధానంగా మచిలీపట్నం నుంచి విశాఖపట్నానికి, తిరుపతికి రైళ్లను పునరుద్దరించాలని కోరినట్లు ఎంపీ బాలశౌరి పేర్కొన్నారు. దీనిపై సదరు మంత్రి సానుకూలంగా స్పందించి ఆగస్టు 11వ తేదీ నుంచి తిరుపతి, విశాఖపట్నానికి రెండు రైళ్లను పునరుద్దరిస్తామని తెలిపినట్లు పేర్కొన్నారు. రైళ్ల పునరుద్దరణ జరిగితే మచిలీపట్నం రైల్వే స్టేషన్‌కు నూతన శోభ వస్తుందన్నారు.

వడ్లమన్నాడు స్టేషన్‌లో పలు రైళ్లను నిలపాలి

గుడివాడ, పెడన నియోజకవర్గంలో అనేక గ్రామాలకు అనుసంధానంగా ఉన్న వడ్లమన్నాడు రైల్వేస్టేషన్ లో రైళ్లు నిలుపుదల చేయకపోవడంతో చిరు వ్యాపారులు, విద్యార్థులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర రైల్వే మంత్రి దృష్టికి బాలశౌరి తీసుకొచ్చారు. గతంలో వడ్లమన్నాడు స్టేషన్‌లో మచిలీపట్నం - బీదర్‌, మచిలీపట్నం - విజయవాడ, మచిలీపట్నం - గుడివాడ, విశాఖపట్నానికి వెళ్లే రైళ్లు నిలిపేవారని ప్రస్తుతం ఈ రైళ్లు ఏవీ అక్కడ ఆగడం లేదని వివరించారు. దీనిపై విజయవాడ రైల్వే అధికారులను విచారించి చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి తెలిపినట్లు ఎంపీ తెలిపారు. మచిలీపట్నం పార్లమెంట్‌ పరిధిలో ఉన్న రైల్వే వంతెనలను త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్ర మంత్రిని బాలశౌరి విన్నవించారు. మచిలీపట్నం పరిధిలో దాదాపు 15 ప్రాంతాలకు పైగా రైల్వే గేట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని వెంటనే వాటిని ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా సుమారు 10 ప్రాంతాల్లో రైల్వే ఓవర్‌ బ్రిడ్జ్‌లు, అండర్‌ బ్రిడ్జిలు నిర్మించాలని వాటికి కూడా నిధులు కేటాయించి వెంటనే పూర్తి చేసేలా చూడాలన్నారు. గుడివాడ, మచిలీపట్నం రైల్వే స్టేషన్లకు ప్రత్యేక నిధులు కేటాయించి కావాల్సిన మౌలిక వసతులు, సుందరీకరణ పనులు చేయాలన్నారు.



Next Story

Most Viewed