మద్యం పాలసీలో అక్రమాల కేసు: చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై విచారణ వాయిదా

by Seetharam |
మద్యం పాలసీలో అక్రమాల కేసు: చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై విచారణ వాయిదా
X

దిశ, డైనమిక్ బ్యూరో : మద్యం కంపెనీల అనుమతుల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు మరికొందరిపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది.ఇరువైపుల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం కేసు విచారణను వాయిదా వేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను గురువారానికి వాయిదా వేసింది.మద్యం పాలసీలో అక్రమాలపై కేసులో సీఐడీ అభియోగాలపై ఎలాంటి ఆధారాలు లేవని చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాదులు వాదించారు. కేవలం రాజకీయ కక్షతోనే వరుస కేసులు నమోదు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాదు 17ఏ నిబంధన చంద్రబాబు నాయుడుకి వర్తిస్తుందని స్పష్టం చేశారు. అభియోగాల నమోదుకు గవర్నర్ అనుమతి తీసుకోలేదని చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాదులు వాదించారు.

ఎక్సైజ్ పాలసీని ఉద్దేశపూర్వకంగా మార్చారు: సీఐడీ


పబ్లిక్ సర్వెంట్‌గా ఉంటూ చంద్రబాబు అధికార దుర్వినియోగం చేశారని సీఐడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. కేబినెట్‌ నిర్ణయానికి విరుద్ధంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దాని ఫలితంగా భారీగా ప్రభుత్వ ఆదాయానికి నష్టం వచ్చిందని వాదించారు. కేబినెట్ నిర్ణయం ప్రకారం వెళ్లాలి లేదా సవరించి ముందుకు వెళ్లాలని..అలా కాకుండా వెళ్తే అవినీతి విస్తృతం అవుతుందని కోర్టుకు తెలియజేశారు. ఎక్సైజ్ పాలసీనీ 5 నుంచి 10 శాతానికి ఉద్దేశ పూర్వకంగా మార్చారని సీఐడీ ఆరోపించింది. అలాగే కొంతమందికే లబ్ధి కలిగేలా మార్పులు చేసి లైసెన్స్ ఇచ్చారని సీఐడీ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు.

కేసు వివరాలివే!

ఇకపోతే ఈ మద్యం కేసులో చంద్రబాబును ఏ3గా, నాటి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను ఏ2 గా చేర్చింది. ఈ మేరకు విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ వేసింది. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు అక్రమంగా కొన్ని మద్యం డిస్టిలరీలకు అనుమతులు ఇచ్చారంటూ సీఐడీ ఆరోపించింది. మరోవైపు దీంతో అటు కొల్లు రవీంద్ర ఇటు చంద్రబాబు నాయుడు ఇద్దరూ ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్ దాఖలు చేశారు. ఇరువురు పిటిషన్లపై మంగళవారం ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. చంద్రబాబు తరపున సీనియర్ అడ్వకేట్ నాగ ముత్తు వాదనలు వినిపించారు. మద్యం కంపెనీలకు అనుమతుల సమయంలో ఎటువంటి అభ్యంతరాలు తెలపలేదని కోర్టుకు తెలిపారు. ఆ సమయంలో ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న వారు అప్పుడు ప్రతిపక్షంలోనే ఉన్నారని గుర్తు చేశారు. అయినా నాడు అభ్యంతరాలు చెప్పలేదని కానీ రాజకీయ కారణంతో కేసు నమోదు చేశారని నాగముత్తు హైకోర్టులో వాదనలు వినిపించారు. ప్రివిలేజ్ ఫీజు నిర్ణయం కూడా నిబంధనల ప్రకారమే తీసుకున్నారని వాదించారు. సీనియర్ అడ్వకేట్ నాగముత్తు వాదనల అనంతరం తదుపరి విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది.

Advertisement

Next Story