నేను పార్టీ మారడంలేదు.. దుష్ప్రచారాన్ని నమ్మకండి: వైసీపీ ఎమ్మెల్యే వసంత క్లారిటీ

by Seetharam |   ( Updated:2023-12-12 06:16:26.0  )
నేను పార్టీ మారడంలేదు.. దుష్ప్రచారాన్ని నమ్మకండి: వైసీపీ ఎమ్మెల్యే వసంత క్లారిటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఎమ్మెల్యే పదవికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారంటూ వస్తున్న వార్తలను మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఖండించారు. ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన ఎమ్మెల్యే పదవికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనంతరం గాజువాక నియోజకవర్గ ఇన్‌చార్జి దేవన్ రెడ్డి సైతం పార్టీకి రాజీనామా చేశారు. ఆ ఇద్దరి నేతల బాటలోనే మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పయనిస్తారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని ఖండిస్తూ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఎమ్మెల్యే పదవికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాల్సిన అవసరం తనకు లేదు అని చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని చెప్పుకొచ్చారు. అంతేకాదు సోమవారం మధ్యాహ్నం ఇబ్రహీంపట్నం మండలంలో లంక భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నట్లు వెల్లడించారు. కావాలని తనపై ఈ విధంగా కొంతమంది పని కట్టుకుని రాజీనామా చేసినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాననే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని కార్యకర్తలకు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పిలుపునిచ్చారు.

Advertisement

Next Story