చెప్పులతో వైసీపీని తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి: టీడీపీ నేతపై దాడిని ఖండించిన లోకేశ్

by Seetharam |
చెప్పులతో వైసీపీని తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి: టీడీపీ నేతపై దాడిని ఖండించిన లోకేశ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు అధికార మదంతో సైకోల్లా ప్రవర్తిస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. వైసీపీ నాయకులు ప్రతిపక్ష పార్టీల నేతలపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే వేలాది మందిపై వైసీపీ సైకోలు దాడులకు పాల్పడ్డారని లోకేశ్ ఆరోపించారు. తాజాగా నంద్యాల జిల్లా కొలిమిగండ్లలో తెలుగు యువత అధికార ప్రతినిధి మంద విజయ్ గోపాల్ పై దాడి జరిగిందని.. ఈ దాడిని తాను ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రతిపక్ష నేతలపై దాడికి పాల్పడుతున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదని లోకేశ్ హెచ్చరించారు. తెలుగు యువత నాయకుడు విజయ్ గోపాల్‌ను వైసీపీ సైకోలు చెప్పులతో కొట్టి అవమానించారని... అవే చెప్పులతో ప్రజలే వారిని తరిమితరిమి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని నారా లోకేశ్ చెప్పుకొచ్చారు. అధికార పార్టీ నాయకులు ఫ్యాక్షనిస్టుల కంటే దారుణంగా దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. రాజకీయ కక్షసాధింపులో అధికార పార్టీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని లోకేశ్ ధ్వజమెత్తారు. ప్రతిపక్ష టీడీపీ నాయకులపై వైసీపీ నాయకులు వరుసగా దాడులు చేస్తుంటే శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులు ఏం చేస్తున్నట్లు? అని లోకేశ్ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. న్యాయం చేయాల్సిన పోలీసులు చివరకు దాడికి గురైన బాధితులపైనే రివర్స్‌ కేసులు పెట్టి వేధించడం దురదృష్టకరమన్నారు. మరోవైపు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం భీమవరం గ్రామ టీడీపీ అధ్యక్షుడు మునిరత్నం నాయుడిపై స్థానిక వైసీపీ నాయకుడు కొటాల చంద్రశేఖర్ రెడ్డి అనుచరులతో కలిసి రాళ్లదాడికి పాల్పడటాన్ని లోకేశ్ ఖండించారు. వైసీపీ ఫ్యాక్షన్ పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని నారా లోకేశ్ మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed