Breaking: స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

by srinivas |
Breaking: స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ జెండాను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుంటూ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తెలుగువారంతా ఒకే రాష్ట్రంగా కలిసి ఉండాలని కలలు గన్నామని చెప్పారు. పొట్టి శ్రీరాముల దీక్షతో కర్నూలు రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు. తదుపరి పరిణామాలతో తెలుగురాష్ట్రం విభజన జరిగిందన్నారు. 60 ఏళ్లలో జరిగిన పరిణామాలతో ప్రతి సారి సవాళ్లతో ఏపీ ప్రయాణం సాగిందన్నారు. విభజనతో ఏర్పడిన నవ్యాంధ్రకు రాజధాని లేని పరిస్థితిలో తామే పాలన ప్రారంభించామన్నారు. ఎక్కడ కూర్చుని పని చేయాలో తెలియని అనిశ్చిత పరిస్థితి నుంచి పాలన సాగించామని చెప్పారు. తమకున్న అనుభవం, ప్రజల సహకారంతో కొద్దికాలంలోనే నిలదొక్కుకున్నామని తెలిపారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టమని, దేశంలో ఎవరూ ఊహించని విధంగా సంస్కరణలతో, సమర్థవంతమైన నిర్ణయాలతో, సరికొత్త పాలసీతో 13.5 శాతం వృద్ధి రేటుతో దేశంలో టాప్ 3 రాష్ట్రాల్లో ఒకటిగా సగర్వంగా నిలబడ్డామని చంద్రబాబు చంద్రబాబు తెలిపారు.


120కి పైగా సంక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చామని చంద్రబాబు పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ డ్యూయింగ్ బిజినెస్‌లో ప్రథమంగా నిలిచామని గుర్తు చేశారు. 16 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలతో దేశం దృష్టిని ఆకర్షించామన్నారు. 2014-19 కాలంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అనూహ్యంగా దూసుకెళ్లిందని చంద్రబాబు తెలిపారు. దేశంలోనే ఒక పెద్ద బ్రాండ్‌గా ఏపీ ఆవిష్కృతమైందన్నారు. రాజధాని లేని రాష్ట్రమని బాధపడుతూ కూర్చోలేదని, సంక్షోభం నుంచి అవకాశాన్ని వెతుకున్నామన్నారు. ఆ క్రమంలో రాష్ట్రానికి నడిబొడ్డున ఉండే అమరావతి ప్రాంతంలో దేశం గర్వంచే రాజధానికి శంకుస్థాపన చేసుకున్నామని తెలిపారు. ప్రజల సహకారంతో 34 ఎకరాల భూ సేకరణ చేసి ప్రపంచం చర్చించుకునే డిజైన్లతో సంపద సృష్టించే రాజధాని నిర్మాణాన్ని ప్రారంభించామని చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీ వ్యవసాయ అధారిత రాష్ట్రమని, సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని చంద్రబాబు తెలిపారు.

‘ఐదేళ్లలో ఇరిగేషన్‌కు 68 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. రాష్ట్రానికి జీవన నాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం. ఒక యజ్ఞంలా పోలవరం పనులను పరుగులు పెట్టించాం. 73 శాతం పనులు పూర్తి చేశాం. తెలుగుదేశం ప్రభుత్వం కొనసాగి ఉంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి అయి ఆ ఫలాలను ప్రజలు నేడు పొందేవారు. 120 సంక్షేమ, అభిృద్ధి పథకాలు, శాంతి భద్రతలు, అందరికీ ఉపాధి, పెట్టుబడులు, ఉద్యోగవకాశాలతో రాష్ట్రం దూసుకుపోతున్న క్రమంలో 2019 ఎన్నికలు రాష్ట్రాన్ని చీకటిమయం చేశాయి’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

‘నియంత పొకడలతో పాలన సాగించారు. ప్రభుత్వ టెర్రరిజానికి నాంది పలికారు. ప్రశ్నిస్తే దాడులు, అక్రమ కేసులు పెట్టారు. ప్రజా వేదిక ధ్వంసంతో పాలన సాగించారు. ప్రజా రాజధానిని పురిటిలోనే చంపే ప్రయత్నం చేశారు ల్యాండ్, మైన్, వైన్, ఎర్రచందనం, రేషన్ మాఫియాతో లక్షల కోట్ల ధనాన్ని కొల్లగొట్టారు. రూ. 10 లక్షల కోట్లు అప్పు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సబ్ ప్లాన్ నిధులు మళ్లించారు. రివర్స్ పాలనతో 30 ఏళ్లు వెనక్కి వెళ్లింది. గత ప్రభుత్వం అసమర్థ విధానాలను కొనసాగించింది.’ అని చంద్రబాబు మండిపడ్డారు.

Next Story

Most Viewed