నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరికి మరో అరుదైన గౌరవం

by srinivas |
నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరికి మరో అరుదైన గౌరవం
X

దిశ, ప్రతినిధి నంద్యాల సిటీ: ఆస్ట్రేలియా విక్టోరియన్ లెజిస్లేటివ్ సెషన్‌కు హాజరవుతున్న భారత ఎంపీలు, భారతీయ సంతతికి చెందిన ఆరోగ్య సంరక్షణ నిపుణులను సత్కరించి, గౌరవించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నంద్యాల ఎంపీ, లోక్‌సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ బైరెడ్డి శబరికి విక్టోరియా ప్రభుత్వ శాసన మండలి విప్, ఓఏఎంఎంపీలీ తర్లామిస్ ఆహ్వానం పంపారు. ఇందుకు బైరెడ్డి శబరి అంగీకరించారు. అక్టోబర్ 17-19 వరకు జరిగే విక్టోరియన్ పార్లమెంటు సమావేశానికి తాను హాజరవుతానని బైరెడ్డి శబరి స్పష్టం చేశారు. భారత దేశం తరపున ఆస్ట్రేలియా విక్టోరియన్ లెజిస్లేటివ్ సెషన్‌‌లో తాను ప్రసంగిస్తానని చెప్పారు. భారతదేశ సాంస్కృతిక, ప్రభుత్వ సంబంధాలను పెంపొందించడంలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని ప్రదానం చేస్తానని తెలిపారు. విక్టోరియా ప్రభుత్వం మద్దతుతో ఆస్ట్రేలియా నిర్వహించే కార్యక్రమంలోనూ గౌరవ అతిథిగా తాను హాజరవుతున్నట్లు బైరెడ్డి శబరి తెలిపారు.

ఆస్ట్రేలియన్ కమ్యూనిటీకి విశిష్ట సేవలందిస్తున్న భారతీయ సంతతికి చెందిన వైద్యులు, నర్సులు భాగస్వామ్యం కావడం ఈ ఈవెంట్ లక్ష్యమన్నారు. ఈ గుర్తింపు ఆస్ట్రేలియాలో ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేయడంలో భారతీయ వారసత్వానికి చెందిన ఆరోగ్య సంరక్షణ నిపుణులు పోషిస్తున్న కీలక పాత్రను హైలైట్ చేస్తుందన్నారు. రెండు దేశాల మధ్య శాశ్వతమైన సంబంధాన్ని బలోపేతం చెబుతుందన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌కు వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. దేశం, ఆంధ్ర రాష్ట్రం గర్వపడేలా తాను పని చేస్తానని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పేర్కొన్నారు.

Advertisement

Next Story