Yemen Boat: యెమెన్‌ తీరంలో మునిగిన పడవ..13 మంది మృతి !

యెమెన్ తీరంలో వలస దారుల పడవ మునిగి పోవడంతో 13 మంది మరణించగా.. మరో 14 మంది గల్లంతైనట్టు ఇంటర్నేషనల్ ఫర్ మైగ్రేషన్(ఐఓఎం) ఓ ప్రకటనలో తెలిపింది.

Update: 2024-08-25 14:42 GMT

దిశ, నేషనల్ బ్యూరో: యెమెన్ తీరంలో వలస దారుల పడవ మునిగి పోవడంతో 13 మంది మరణించగా.. మరో 14 మంది గల్లంతైనట్టు ఇంటర్నేషనల్ ఫర్ మైగ్రేషన్(ఐఓఎం) ఓ ప్రకటనలో తెలిపింది. మృతుల్లో 11 మంది పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నట్టు పేర్కొంది. ఈ నౌక 25 మంది ఇథియోపియన్ వలసదారులు, ఇద్దరు యెమెన్ పౌరులతో జిబౌటి నుంచి బయలుదేరింది. ఈ క్రమంలోనే దుబాబ్ జిల్లా సమీపంలో మునిగిపోయినట్టు ఐఓఎం వెల్లడించింది. ప్రమాదానికి గల కారణాలను వెల్లడించలేదు. గల్లంతైన వారి కోసం రెస్య్కూ టీమ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. ‘ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి జీవితం చాలా విలువైంది. ఇలాంటి వినాశకరమైన నష్టాలను సాధారణీకరించకుండా ఉండటం అత్యవసరం. వలసదారులకు వారి ప్రయాణాలలో రక్షణ, మద్దతు ఉండేలా సమిష్టిగా పని చేయడం చాలా అవసరం’ అని ఐఓఎం చీఫ్ హుబెర్ తెలిపారు.

ప్రతి ఏటా పది వేల మంది శరణార్థులు, వలసదారులు ఆఫ్రికాలో నెలకొన్న సంఘర్షణ, ప్రకృతి వైపరీత్యాలు, ఆర్థిక సంక్షోభం నుంచి తప్పించుకోవడానికి గల్ఫ్ దేశాలకు వెళ్తుంటారు. ఆయా దేశాలకు చేరుకోవడానికి వీరు ప్రధానంగా ఎర్ర సముద్రం మీదుగా ప్రయాణిస్తారని తెలుస్తోంది. వీరంతా గల్ఫ్ దేశాల్లో గృహ నిర్మాణ కార్మికులుగా పని చేస్తారని పలు కథనాలు పేర్కొన్నాయి. గతేడాది 97,200 మంది ఎర్ర సముద్రం మీదుగా ప్రయాణించినట్టు తెలిపాయి. కాగా, గతంలోనూ వలస దారుల పడవలు మునిగి అనేక మంది మరణించిన విషయం తెలిసిందే. 

Tags:    

Similar News