అమెరికా అధ్యక్ష రేసులో హర్ష్వర్ధన్ సింగ్..
అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో ఇప్పుడు మరో ప్రవాస భారతీయుడు చేరాడు.
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో ఇప్పుడు మరో ప్రవాస భారతీయుడు చేరాడు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని హర్ష్వర్ధన్ సింగ్ ప్రకటించారు. ఈ మేరకు తన అభ్యర్థిత్వాన్ని ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ వద్ద నమోదు చేసుకున్నారు. ఇప్పటికే ఇద్దరు భారతీయ అమెరికన్లు.. నిక్కీ హేలీ(51), వివేక్ రామస్వామి(37) ఈ రేసులో ఉన్నారు. తాజాగా ఇంజినీర్ హర్ష్వర్ధన్ సింగ్ కూడా తన ఆసక్తిని ప్రకటించడంతో.. రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న భారత సంతతి నేతల సంఖ్య మూడుకు పెరిగింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా రిపబ్లికన్ పార్టీ నాయకుడే. అంటే అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ఈ ముగ్గురు భారత సంతతి నేతలు.. డొనాల్డ్ ట్రంప్ తో పోటీపడనున్నారు. అయితే రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా పోటీలో ఎవరు ఉండాలనేది వచ్చే ఏడాది జులై 15 నుంచి 18 వరకు విస్కోన్సిన్లో జరగబోయే రిపబ్లికన్ల జాతీయ సదస్సులో నిర్ణయించనున్నారు.