Nethanyahu: ఇజ్రాయెల్‌కు భారీ షాక్.. నెతన్యాహు లక్ష్యంగా డ్రోన్ దాడి

గాజాలో హమాస్, లెబనాన్‌లో హిజ్బుల్లాలపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్‌కు భారీ షాక్ తగిలింది.

Update: 2024-10-19 09:25 GMT

దిశ, నేషనల్ బ్యూరో: గాజాలో హమాస్, లెబనాన్‌లో హిజ్బుల్లాలపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్‌కు భారీ షాక్ తగిలింది. ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు లక్ష్యంగా శనివారం డ్రోన్ దాడి జరిగింది. సిజేరియా పట్టణంలోని నెతన్యాహు ప్రయివేట్ నివాసం సమీపంలోనే డ్రోన్ పడినట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. లెబనాన్ వైపు నుంచి ఈ దాడి జరిగిందని వెల్లడించింది. అయితే దాడి సమయంలో నెతన్యాహు, ఆయన కుటుంబ సభ్యులు ఇంట్లో లేరని.. దీంతో ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని పేర్కొంది. నెతన్యాహు టార్గెట్ గానే ఈ అటాక్ జరిగిందని భావిస్తున్నట్టు తెలిపింది.

లెబనాన్ నుంచి దూసుకొచ్చిన మూడు డ్రోన్లు

లెబనాన్ భూభాగం నుంచి మూడు డ్రోన్లు ఇజ్రాయెల్ పైకి దూసుకొచ్చినట్టు ఐడీఎఫ్ తెలిపింది. వీటిలో ఒకటి సీజేరియా పట్టణంలోని ఓ భవనంపై పడింది. ఆ తర్వాత మరో రెండు డ్రోన్లను ఐడీఎఫ్ దళాలు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌కు ఉత్తరాన ఉన్న గ్లిలాట్‌ సైనిక స్థావరం వద్ద హెచ్చరిక సైరన్‌లు మోగాయి. ఈ ఘటనలపై విచారణ జరుపుతున్నట్టు ఇజ్రాయెల్ తెలిపింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్ని వేళ నెతన్యాహు లక్ష్యంగా దాడి జరగడంతో ఆందోళనలు నెలకొన్నాయి. హమాస్ చీఫ్ యహ్యా సిన్వార్‌ను ఇజ్రాయెల్ హతం చేసిన కొద్ది రోజుల్లోనే ఈ దాడి జరగడం గమనార్హం.

మరోవైపు సిన్వార్ మరణంపై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తొలిసారిగా స్పందించారు. యాహ్యా సిన్వార్ మరణించిన తర్వాత కూడా హమాస్ పోరు ముగియబోదని తెలిపారు. ఆయన మరణం బాధాకరమని పేర్కొన్నారు. ఇరాన్ ఎప్పటిలాగే పోరాట యోధులకు అండగా నిలుస్తుందని చెప్పారు. హమాస్ సజీవంగానే ఉంటుందని స్పష్టం చేశారు. కాగా, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజు రోజుకూ పెరుగుతుండటంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. 


Similar News