Paris Olympic: వారం రోజులకే మెడల్ కలర్ చేంజ్.. ఒలింపిక్ పతకంపై అథ్లెట్ ఆరోపణ

ఒలింపిక్ పతకం వారం రోజులకే రంగు మారడం హాట్ టాపిక్ గా మారింది.

Update: 2024-08-10 12:09 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో జరుగుతున్న 2024 ఒలింపిక్ క్రీడా సంగ్రామం చుట్టూ వివాదాల పరంపర కొనసాగుతూనే ఉన్నది. సెయిన్ నదిపై అట్టహాసంగా నిర్వహించిన ఈ క్రీడల ప్రారంభ వేడుకలపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు రాగా ఆ తర్వాత స్పోర్ట్స్ విలేజెస్ లో వసతులు సరిగా లేవంటూ చాలా మంది అథ్లెట్లు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే వస్తున్నారు. భారత అథ్లెట్ వినేశ్ ఫొగాట్ అనర్హత వేటు విషయంలోనూ పారిస్ ఒలింపిక్ కమిటీపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటువంటి తరుణంలో తాజాగా ప్రతిష్టాత్మక ఒలింపిక్ లో తాను సాధించిన పతకం రంగు మారుతున్నదని అమెరికా స్కేటర్ నిజా వ్యూస్టన్ అసంతృప్తిని వ్యక్తం చేయడం హాట్ టాపిక్ గా మారింది. గత వారం స్ట్రీట్ స్కేట్ బోర్డింగ్ లో నేను సాధించిన కాంస్య పతకం రంగు వారం రోజులకే రంగుమారిందని ఆరోపించారు. రంగుమారిన పోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

ఈ పతకం సాధించినప్పుడు కొత్తలో చాలా అద్భుతంగా అనిపించింది. కానీ వారం రోజులేక రంగు పోయింది. అయితే చెమట తగలడం వల్ల రంగుమారిందని భావించాను. కానీ నిజానికి ఈ పతకాలు అనుకున్నంత నాణ్యతతో లేవు. అలాగే కాస్త గరుకుగా మారిపోయాయి. దీన్ని చూస్తుంటే ఏదో యుద్ధానికి వెళ్లి వచ్చినట్లుగా అనిపిస్తున్నది.. మరింత నాణ్యత పెంచితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు పతకం సాధించిన రోజు దిగిన ఫోటో, తాజాగా కలర్ మారిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో పారిస్ ఒలింపిక్స్ అధికార ప్రతినిధి స్పందించారు. దీనిపై చర్యలు చేపట్టామని డ్యామేజ్ అయిన మెడల్స్ స్థానంలో కొత్త వాటిని ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు. 

Tags:    

Similar News