సైనికులారా...యుద్ధానికి సిద్ధం కండి : జిన్ పింగ్

యుద్ధానికి సిద్ధం కావాలని చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ తన దేశ సైనిక బలగాలకు పిలుపునిచ్చినట్లుగా ఆ దేశ మీడియా సంస్థల కథనం.

Update: 2024-10-20 05:35 GMT

దిశ, వెబ్ డెస్క్ : యుద్ధానికి సిద్ధం కావాలని చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ తన దేశ సైనిక బలగాలకు పిలుపునిచ్చినట్లుగా ఆ దేశ మీడియా సంస్థల కథనం. తైవాన్, చైనా మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన క్రమంలో చైనా యుద్ద సన్నాహాలు చేపట్టిందని చైనా అధికారిక వార్త సంస్థ షినువా ఓ కథనం వెలువరించింది. దేశ భద్రత, ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకు సైన్యం సన్నద్దం కావాలని సూచించినట్లు మీడియ సంస్థలు పేర్కొన్నాయి. ఇటీవల పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రాకెట్ పోర్స్ కు చెందిన బ్రిగేడ్ ను అధ్యక్షుడు షీ జిన్ పింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా యుద్ధ సన్నాహాలను అన్ని విభాగాల్లో బలోపేతం చేయాలని, సైనిక దళాలు పటిష్ఠమైన పోరాట సామర్ధ్యాలను కలిగి ఉండేలా చూడాలని సూచించారు. సైనికులు తమ వ్యూహాత్మక పోరాట సామర్ధ్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరముందని జిన్ పింగ్ పేర్కొన్నారు.

జిన్ పింగ్ యుద్ధ సన్నాహాల వ్యాఖ్యలు తైవాన్ తో యుద్ధానికా., లేక భారత్ తో ఉత్తర సరిహద్దుల్లో ఇప్పటికే 80వేల సైనికులను మోహరించిన నేపథ్యంలో భారత్ తో యుద్ధానికేనా అన్న సందేహాలను అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం మరింత ముదురుతున్నదని, మూడో ప్రపంచ యుద్ధం సంభవించే ప్రమాదముందని అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ ఆందోళన వ్యక్తం చేశారు. హెజ్బొల్లా మిలిటెంట్‌ గ్రూప్‌, ఇజ్రాయెల్‌ బలగాల మధ్య భీకరపోరు మొదలైన కొన్ని గంటల్లోనే ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు

రష్యా ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం మొదలై రెండేళ్లు దాటుతోంది. ఏడాది క్రితం మొదలైన ఇజ్రాయేల్, హమాస్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. మరోవైపు ఇరాన్, లెబనాన్ లు సైతం యుద్ధ రంగంలోకి దిగాయి. దక్షిణాసియాలో నార్త్ కొరియా-సౌత్ కొరియా బోర్డర్‌లో యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా చైనా అధ్యక్షుడు తైవాన్‌ ఆక్రమణ కాంక్షతో యుద్ద సన్నాహాలకు పిలుపునివ్వడంతో ఆయా దేశాల మధ్య యుద్ధం మూడో ప్రపంచ యుద్దం దిశగా సాగుతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 


Similar News