Israel warning: హిజ్బొల్లా స్థావరాలను విడిచిపెట్టండి.. లెబనాన్ పౌరులకు ఇజ్రాయెల్ వార్నింగ్

హిజ్బొల్లా గ్రూపున ఆయుధాలు నిల్వచేసే ఇండ్లను వెంటనే విడిచిపెట్టాలని లెబనాన్ పౌరులకు ఇజ్రాయెల్ ఆదేశాలు జారీ చేసింది.

Update: 2024-09-23 09:29 GMT

దిశ, నేషనల్ బ్యూరో: హిజ్బొల్లా మిలిటెంట్ గ్రూపునకు చెందిన ఆయుధాలు నిల్వచేసే ఇండ్లు, ఇతర భవనాలను వెంటనే విడిచిపెట్టాలని లెబనాన్ పౌరులకు ఇజ్రాయెల్ సైన్యం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) ప్రతినిధి డేనియల్ హగారి మాట్లాడుతూ..‘ఆయుధాలను నిల్వ చేయడం, సైనిక అవసరాల కోసం హిజ్బొల్లా ఉపయోగించే భవనాలు, దానికి సమీపంలో ఉన్న లెబనీస్ గ్రామాలకు చెందిన పౌరులకు సలహా ఇస్తున్నాం. మీరు క్షేమంగా ఉండాలంటే వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోండి’ అని పేర్కొన్నారు. తదుపరి నోటీసులు వచ్చే వరకు గ్రామాల్లోకి రావొద్దని సూచించారు. దీంతో ఇజ్రాయెల్, హిజ్బొల్లా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ లెబనాన్‌లోని 17 గ్రామాలు, పట్టణాలను చూపించే మ్యాప్‌ను కూడా విడుదల చేసింది. ఈ ప్రాంతాల్లోని మొత్తం కమ్యూనిటీలను హిజ్బొల్లా మిలిటెంట్ స్థావరాలుగా మార్చిందని, రాకెట్ లాంచర్లు, ఇతర ఆయుధ సామగ్రి ఇక్కడే ఉన్నాయని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఇజ్రాయెల్ ఆదేశాలతో ఎంత మంది ప్రజలు ప్రభావితమవుతారనేది వెంటనే స్పష్టంగా తెలియలేదు. అయితే దాదాపు రోజువారీ కాల్పుల కారణంగా సరిహద్దుకు ఇరువైపులా ఉన్న ప్రాంతాలు ఇప్పటికే చాలా వరకు ఖాళీ అయినట్టు తెలుస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ వైమానిక దళం సోమవారం తెల్లవారుజామున దక్షిణ లెబనాన్ అంతటా డజన్ల కొద్దీ వైమానిక దాడులు నిర్వహించినట్టు స్థానిక కథనాలు వెల్లడించాయి.

కాగా, ఇటీవల హిజ్బొల్లా మిలిటెంట్లే లక్ష్యంగా లెబనాన్ లో పేజర్లు, వాకీటాకీలు పేలిన విషయం తెలిసిందే. అయితే ఇది ఇజ్రాయెల్ పనేనని హిజ్బొల్లా ఆరోపించగా దీనిపై ఇజ్రాయెల్ స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే ప్రతీకారం తీర్చుకుంటామని హిజ్బొల్లా హెచ్చరించింది. దాడులు ఉధృతం చేస్తామని తెలిపింది. దీంతో ఇజ్రయెల్, హిజ్బొల్లా మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇప్పటికే రాకెట్లతో లెబనాన్ పై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ మరిన్ని దాడులకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. 


Similar News