Bangladesh crisis: బంగ్లాదేశ్‌లో చల్లారని ఆగ్రహజ్వాలలు.. హిందూ సంగీత కారుడి ఇంటికి నిప్పు

బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ కోటాకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలతో దేశంలో సంక్షోభ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.

Update: 2024-08-07 05:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ కోటాకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలతో దేశంలో సంక్షోభ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసినప్పటికీ నిరసనకారుల్లో ఆగ్రహజ్వాలలు మాత్రం చల్లారడం లేదు. ఏదో ఒక చోట విధ్వంసం సృష్టిస్తూనే ఉన్నారు. తాజాగా ఆ దేశ రాజధాని ఢాకాలో హిందూ సంగీతకారుడు అయిన రాహుల్ ఆనంద ఇంటికి నిప్పుపెట్టారు. ఈ దాడి నుంచి ఆనంద, అతని భార్య, కుమారుడు క్షేమంగా బయటపడినప్పటికీ ఆనంద ఇంటిలోని విలువైన వస్తువులను ఆందోళన కారులు చోరీ చేశారు. ఆందులో ఆనంద్ వాయించే చేతితో తయారు చేసిన 3, 000సంగీత వాయిద్యాలు కూడా ఉన్నాయి. కాగా, రాహుల్ ఢాకాలో జోలెర్ గాన్ అనే జాన‌ప‌ద బ్యాండ్‌ను న‌డుపుతున్నారు. మరోవైపు షేక్ హసీనా రాజీనామా తర్వాత హిందువులు, మైనారిటీలపై దాడులు పెరిగాయని పలు కథనాలు పేర్కొంటున్నాయి.

సినీ, నిర్మాత, హీరోల హత్య

ప్రముఖ సినీ నిర్మాత సలీం ఖాన్, ఆయన కుమారుడైన హీరో షాంట్ ఖాన్‌ను ఆందోళనకారులు కొట్టి చంపేశారు. ఫరక్కాబాద్ మార్కెట్‌లో ఆయనను చుట్టుముట్టి హత్య చేసినట్టు తెలుస్తోంది. వీరిద్దరూ హసీనా పార్టీ అవామీ లీగ్‌తో సంబంధం కలిగి ఉన్నట్టు ఆరోపణలతోనే దాడికి పాల్పడినట్టు స్థానిక కథనాలు పేర్కొ్న్నాయి. అంతేగాక అవామీ లీగ్ నాయకులు, వారి కుటుంబ సభ్యుల కనీసం 29 మృతదేహాలు లభ్యమయ్యాయి. అంతేగాక అవామీ లీగ్‌తో సంబంధం ఉన్న చాలా మంది సీనియర్ పోలీసు అధికారులు అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. దీంతో దేశ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది.  

Tags:    

Similar News