ప్రియుడి కోసం సొంత కుటుంబాన్నే అంతమొందించిన కూతురు

కన్నవారి కంటే ప్రియుడే ఎక్కువనుకున్న ఓ కూతురు తన ప్రేమోన్మాదానికి తన సొంత కుటుంబాన్నే బలి చేసింది.

Update: 2024-10-07 06:01 GMT

దిశ, వెబ్ డెస్క్ : కన్నవారి కంటే ప్రియుడే ఎక్కువనుకున్న ఓ కూతురు తన ప్రేమోన్మాదానికి తన సొంత కుటుంబాన్నే బలి చేసింది. ప్రేమించిన యువకుడితో పెళ్ళికి నిరాకరించారన్న కోపంతో ఓ యువతి ప్రియుడితో కలిసి భోజనంలో విషం కలిసి తన సొంతింటి వాళ్లందరినీ చంపేసింది. ఈ దారుణ ఘటన పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో పోలీసుల విచారణతో వెలుగులోకి వచ్చింది. తన ప్రేమ కోసం తన కుటుంబంలో 13 మందిని చంపిన యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఖైర్‌పూర్‌కు చెందిన సీనియర్ పోలీసు అధికారి ఇనాయత్ షా తెలిపిన వివరాల మేరకు పాకిస్థాన్‌లోని ఖైర్‌పూర్ సమీపంలోని హైబత్ ఖాన్ బ్రోహి గ్రామంలో ఆగస్టు 19న ఒకే కుటుంబంలో 13 మంది మరణాలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా.. సొంత కుమార్తె ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకునేందుకు తల్లిదండ్రులు అంగీకరించలేదనీ ఆగ్రహించిన సదరు యువతి తల్లిదండ్రులతో సహా కుటుంబం మొత్తాన్ని లేపేసేందుకు ప్రియుడితో కలిసి కుట్ర పన్నింది. రాత్రి భోజనంలో విషం కలపి, ఇంట్లో అందరికీ వడ్డించింది. ఆ ఆహారం తిన్న తర్వాత కుటుంబ సభ్యులందరూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ 13 మంది మృతి చెందారు. ఈ ఘటనపై పోస్ట్‌మార్టం నివేదికలో వారు విషపూరిత ఆహారం కారణంగా మరణించినట్లు తేలింది. పోలీసుల విచారణలో మృతుల సొంత కూతురు, ఆమె ప్రియుడు కలిసి ఇంట్లో రొట్టెలు చేయడానికి ఉపయోగించే గోధుమపిండిలో విషం కలిపినట్లు వెల్లడైంది. దీంతో పోలీసులు ఆదివారం నిందితురాలిని అరెస్టు చేశారు. 


Similar News