గాజాపై ఇజ్రాయెల్ దాడి.. 8 మంది మృతి

ఇజ్రాయెల్ దళాలు మంగళవారం దక్షిణ గాజాపై బాంబులు, ఫిరంగి షెల్లింగ్‌‌లతో దాడులు చేయడంతో దాదాపు ఎనిమిది మంది వరకు మృతి చెందారు.

Update: 2024-07-02 13:24 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్ దళాలు మంగళవారం దక్షిణ గాజాపై బాంబులు, ఫిరంగి షెల్లింగ్‌‌లతో దాడులు చేయడంతో దాదాపు ఎనిమిది మంది వరకు మృతి చెందారు. ఈజిప్ట్‌ సరిహద్దు సమీపంలో ఉన్న ఖాన్ యునిస్ ప్రాంతంలో ఈ దాడులు చోటుచేసుకున్నాయి. ఈ దాడుల్లో ఎనిమిది మంది మృతి చెందగా, 30 మందికి పైగా గాయపడ్డారని, వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని నగరంలోని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అక్కడి ప్రాంతాలను ప్రజలు ఖాళీ చేస్తున్నారు. అల్-ఖరారా, బని సుహైలా పట్టణాలతో సహా ఖాన్ యునిస్, రఫా నగరాలకు తూర్పున ఉన్న చాలా ప్రాంతాలను ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ దళాలు స్థానికులను ఆదేశించాయి. దీంతో వారంతా కూడా అక్కడి నుంచి ఇతర సురక్షిత స్థలాలకు తరలివెళ్తున్నారు. బని సుహైలా నివాసి అహ్మద్ నజ్జర్ మాట్లాడుతూ ఇజ్రాయెల్ ఆదేశాలతో తీవ్రంగా భయపడుతున్నాము. ఇప్పటికే చాలా మంది చనిపోయారు. మా ప్రాణాలను కాపాడుకోవడానికి ఇతర ప్రాంతాలకు వెళుతున్నట్లు చెప్పారు. అంతకుముందు షుజయ్యాలోని గాజా సిటీ జిల్లాకు గత వారం ఇదే విధమైన హెచ్చరికను ఇజ్రాయెల్ జారీ చేసింది. ఆ తర్వాత వరుసగా ఆరు రోజుల పాటు అక్కడ తీవ్రమైన దాడులు చేసింది.


Similar News