బండి సంజయ్ రాకపై షాద్ నగర్ లో భిన్న స్వరాలు..

దిశ, షాద్ నగర్ : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ కేంద్రానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి

Update: 2022-04-02 16:33 GMT

దిశ, షాద్ నగర్ : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ కేంద్రానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదివారం రానున్నారు. పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ అధినేత, బీజేపీ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం జరగబోయే ప్రైమ్ మినిస్టర్ కప్ 2022 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా బండి సంజయ్ వస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అయితే ఆయన రాకకు సంబంధించిన సమాచారం షాద్ నగర్ బీజేపీ సీనియర్ నాయకులకు లేదనే అంతర్గత చర్చ మొదలైనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం షాద్ నగర్ నియోజకవర్గం బీజేపీ బాధ్యులుగా సీనియర్ నేత నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. అయితే బండి సంజయ్ పర్యటన విషయం ఆయనకు తెలియకుండా ఏర్పాటు అయిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇటీవల కాలంలో పార్టీలో చేరిన వారు పార్టీ లైన్ దాటి ఎక్కువ చొరవ చూపుతున్నారనే విమర్శలు కూడా బయలుదేరాయి. విష్ణువర్ధన్ రెడ్డి ఏర్పాటు చేయబోయే కార్యక్రమానికి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు డీకే అరుణ, జితేందర్ రెడ్డి, తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ గురువారెడ్డి తదితరులు వస్తున్నట్లు మీడియాకు వెల్లడించారు. అయితే ముఖ్యమైన కార్యక్రమం కాబట్టి స్థానిక పార్టీలో చర్చ జరపకుండా, కనీసం సమాచారం లేకుండా నేరుగా ఎలా ఆహ్వానిస్తారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ సందర్భంగా శనివారం సాయంత్రం కొంతమంది బీజేపీ సీనియర్ నాయకులు స్థానికంగా సమావేశమై పార్టీ క్రమశిక్షణ వ్యవహారంలో తర్జనభర్జనలు చేసినట్లు తెలుస్తోంది. కార్యక్రమాలు చేసేటప్పుడు పార్టీలో సమిష్టిగా అందరికీ చెప్పి ఒక స్థాయిలో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి, కానీ అలా కాకుండా తమ స్వప్రయోజనాలు, స్వలాభం కోసమే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఇప్పుడు షాద్ నగర్ బీజేపీలో మిన్నంటాయి.

ఈ నేపథ్యంలో పార్టీ జిల్లాస్థాయి అధ్యక్షునికి సైతం సమాచారం లేదని, ఆహ్వాన ప్రచార పత్రాలలో ఆయన ఫోటో కూడా లేదనే వాదన వినిపిస్తోంది. పార్టీ బలోపేతం అవుతున్న దశలో ఇలాంటి నియంతృత్వ పోకడలు, ఏకాంత నిర్ణయాలు సరైనవి కావని పార్టీలోని సీనియర్లు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఆదివారం నుంచి జరగబోయే ప్రైమ్ మినిస్టర్ క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమం బీజేపీ నాయకుల మధ్య అంతర్గత విబేధాల పై కొంత చర్చకు దారితీసింది. కార్యక్రమ ఉద్దేశం మంచిదే అయినప్పటికీ పార్టీ ప్రోటోకాల్ పక్కనపెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించడం అంత శ్రేయస్కరం కాదు అంటూ చర్చలు బయలుదేరాయి. ఈ పరిణామం ఎక్కడికి దారి తీస్తుందోనని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News