జమ్ము కశ్మీర్‌లో ప్రజల తీర్పును స్వాగతిస్తున్నాం: బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల

జమ్ము కశ్మీర్‌లో ప్రజల తీర్పును స్వాగతిస్తున్నామని, అయితే అక్కడ ప్రతిపక్ష హోదాలో ప్రజల సంక్షేమం కోసం పోరాడుతామని మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు.

Update: 2024-10-08 16:23 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : జమ్ము కశ్మీర్‌లో ప్రజల తీర్పును స్వాగతిస్తున్నామని, అయితే అక్కడ ప్రతిపక్ష హోదాలో ప్రజల సంక్షేమం కోసం పోరాడుతామని మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. జమ్ము కాశ్మీర్‌లో మెరుగైన స్థానాలు సాధించడం మామూలు విషయం కాదని ఆయన పేర్కొన్నారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మంగళవారం మాట్లాడారు. హర్యానాలో బీజేపీ గెలుపుపై హర్షం వ్యక్తంచేశారు. పేదల గురించి ఆలోచించే పార్టీ బీజేపీ అని, అందుకే ప్రజలు గెలిపించారన్నారు. హర్యానాలో హ్యాట్రిక్ సాధించామన్నారు.

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. బీజేపీకి వచ్చిన ఫలితాలు చూస్తుంటే తమకు మరింత ప్రజామోదం లభించినట్లయిందని, తమకు ఆదరణ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదని పేర్కొన్నారు. కొందరు మేధావుల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి హర్యానా ప్రజలు మంచి తీర్పు ఇచ్చారన్నారు. కాంగ్రెస్ ఉచిత తాయిలాలు అవసరం లేదని స్పష్టం చేశారన్నారు. ఇదిలా ఉండగా జమ్ము కాశ్మీర్‌లో ఎలాంటి ఘర్షణలు లేకుండా ఎన్నికలు జరిగాయని తెలిపారు. ఈ ఎన్నికల ఫలితాలతో తమపై మరింత బాధ్యత పెరిగిందని వివరించారు. ఈ ఊపుతో వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.

బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ మాట్లాడుతూ.. హర్యానా విజయం, జమ్మూ కశ్మీర్ లో సీట్లు పెరగడం మోడీ నాయకత్వానికి నిదర్శనంగా నిలిచాయని కొనియాడారు. జమ్మూ కాశ్మీర్ ఫలితాలు.. బుల్లెట్ ను కాదని, బ్యాలెట్ ప్రాధాన్యతను పెంచారని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దును కొందరు వ్యతిరేకించినా అక్కడ బీజేపీకి పెరిగిన ఓటింగ్ శాతం చూస్తుంటే మోడీ నిర్ణయంపై సానుకూలతను ప్రస్ఫుటం చేస్తోందన్నారు. ఇక హర్యానా ఫలితాల విషయానికొస్తే టీ20 వరల్డ్ కప్ లో సూర్య కుమార్ యాదవ్ బౌండరీ వద్ద పట్టిన క్యాచ్ గుర్తుకువస్తుందని కొనియాడారు. ఈ ఎన్నికల ఫలితాలతో రాహుల్ ఎవర్ లాంఛింగ్ స్టార్టప్ గానే మిగిలిపోనున్నారని ఎద్దేవా చేశారు.


Similar News