పోలీసుల వైఖరిపై సీపీకి పెద్ది సుదర్శన్ రెడ్డి లేఖ

నర్సంపేట నియోజకవర్గంలో శాంతి భద్రతలు అదుపు తప్పినట్లు,

Update: 2024-10-15 10:54 GMT

దిశ,నర్సంపేట: నర్సంపేట నియోజకవర్గంలో శాంతి భద్రతలు అదుపు తప్పినట్లు, ప్రజల పట్ల పోలీసుల వ్యవహారశైలికి సంబంధించి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పలు ఆరోపణలు చేశారు. పోలీసుల వైఖరి తో సామాన్య ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ తమ వద్ద పలు ఆధారాలున్నాయని స్పష్టం చేశారు. ఈ ఘటనలపై విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ వరంగల్ సీపీ కి లేఖ రాశారు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ వచ్చే ఫిర్యాదు దారుని సదరు వ్యక్తి ఏ పార్టీకి చెందిన వాడు అనే కోణంలో చూస్తున్నట్లు ఆరోపించారు. అధికార పార్టీ వ్యక్తులతో మర్యాదగా ప్రవర్తించడం, ఇతర పార్టీల వ్యక్తులతో ఇష్టారీతిన ప్రవర్తించడం ప్రధానంగా ప్రస్తావించారు. కొన్ని నెలలుగా పోలీసుల వ్యవహార శైలి మారిందన్నారు.

నర్సంపేట పోలీస్ స్టేషన్ లో జరుగుతున్న వసూళ్ల దందా తతంగం, ప్రజా ప్రతినిధులను అగౌరవ పర్చడం, కబ్జాలకు దగ్గరుండి హద్దులు ఏర్పాటు చేయించడం లాంటి ఘటనలకు సంబంధించి ఆధారాలున్నట్లు, అందజేయడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.స్వల్ప వ్యవధిలో చెన్నారావుపేట పోలీస్ స్టేషన్ లో నలుగురు ఎస్.హెచ్.ఓ లు మారడం, నర్సంపేటలో ఎనిమిది మంది ఎస్సైలు, దుగ్గొండి సర్కిల్ లో ఏడాది లోపే ముగ్గురు సీఐలు మారడాన్ని గుర్తు చేశారు. శాంతి భద్రతలు ఏ స్థాయిలో విఫలం చెందాయో అర్థం చేసుకోవచ్చన్నారు. నర్సంపేట నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్ లలో సామాన్య ప్రజలు నేరుగా వెళ్లి తమ పిర్యాదులు చేసే పరిస్థితి లేదన్నారు. ఈ ఘటనలకు సంబంధించి పూర్తి విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది వరంగల్ సీపీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.


Similar News