Encounter: మావోయిస్టు అగ్రనేత ఏసోబు ఎన్కౌంటర్..
మావోయిస్టు పార్టీ అగ్ర నేత మాచర్ల ఏసోబు అలియాస్ జగన్ అలియాస్ దాదా రణదేవ్ ఛత్తీస్ఘడ్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందాడు.
దిశ, వరంగల్ బ్యూరో: మావోయిస్టు పార్టీ అగ్ర నేత మాచర్ల ఏసోబు అలియాస్ జగన్ అలియాస్ దాదా రణదేవ్ ఛత్తీస్ఘడ్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందాడు. కేంద్ర మిలిటరీ ఇంచార్జ్, మహారాష్ట్ర ఛత్తీస్ఘడ్ బార్డర్ ఇంచార్జ్గా కొనసాగుతున్న రణదేవ్ స్వస్థలం హన్మకొండ జిల్లాలోని కాజీపేట మండలం టేకులగూడెం గ్రామం. 1980లో మావోయిస్టు ఉద్యమంలో చేరిన ఆయన అంచలంచెలుగా ఎదిగి కేంద్ర పార్టీలో కీలక స్థాయికి చేరుకున్నారు. మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో రణదేవ్ మృతి చెందినట్లుగా దంతెవాడ ఎస్పీ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. రణదేవ్ భార్య మాచర్ల లక్ష్మక్క గతేడాది అనారోగ్యంతో మృతి చెందింది. రణదేవ్కు ముగ్గురు పిల్లలు ఉన్నారు. రణదేవ్ మరణంతో ఆయన స్వస్థలం టేకులగూడెంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. ఛత్తీస్ఘడ్ నుంచి టేకులగూడెంకు ఆయన మృతదేహాన్ని తీసుకురానున్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు.