4వ తరగతి బాలికపై అఘాయిత్యం..! నిందితుడిని కాపాడుతున్న నేతలు!

కామాంధుల దాడులకు అభం శుభం తెలియని చిన్నారులు కూడా బలవుతున్న ఘటనలు రోజూ వింటూనే ఉన్నాం.

Update: 2024-09-29 03:27 GMT

దిశ, అచ్చంపేట: కామాంధుల దాడులకు అభం శుభం తెలియని చిన్నారులు కూడా బలవుతున్న ఘటనలు రోజూ వింటూనే ఉన్నాం. తాజాగా అలాంటి ఘటనే నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారం మేరకు.. మండలంలోని ఓ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న ఓ చిన్నారికి మాయమాటలు చెప్పి స్కూలు వద్ద నుండి మైలారం గుట్ట పైకి తీసుకెళ్లి అగాయిత్యానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. చిన్నారి అరుపులు విని చుట్టుపక్కల వారు ఆమెని కాపాడారు. మండలంలో వినాయకచవితి వేడుకల సమయంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది.

ఇదిలా ఉంటే ఇప్పటివరకు నిందితుడిపై ఎలాంటి కేసు నమోదవకపోవడం గమనార్హం. అతడికి స్థానికంగా ఉన్న పొలిటికల్ లీడర్ల సపోర్ట్ ఉందని, అందుకే అతడిపై ఈ కేసు నమోదు కావడం లేదని ఆరోపణలు ఉన్నాయి. అయితే నిందితుడిపై ఇప్పటికే బైకు దొంగతనం కేసు నమోదైనట్లు తెలుస్తోంది. అలాగే మత్తు పదార్థాలకు బానిసగా ఉంటూ అనేకమంది యువతను కూడా చెడు వ్యసనాలకు బానిస చేశాడని ఆరోపణలున్నాయి.

ఇదిలా ఉంటే బాధిత చిన్నారికి తల్లి చిన్నతనంలోనే చనిపోగా.. తండ్రి మాత్రమే ఉన్నాడు. అమ్మమ్మ వద్ద ఉంటూ చదువుకుంటోంది. నిందితుడిని అరెస్ట్ చేసి వెంటనే శిక్ష పడేలా చేయాలని, బాధిత చిన్నారికి న్యాయం చేయాలని బాలిక కుటుంబ సభ్యులు, గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఈ విషయమే ఎస్సై గురు స్వామిని వివరణ కోరగా.. ఘటనపై ఫిర్యాదులు అందాయని, విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.


Similar News