ఆత్మీయత.... మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్
పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు...ఆత్మీయత,

దిశ, ఖమ్మం రూరల్ : పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు...ఆత్మీయత, మతసామరస్యానికి ప్రతీక అని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని సత్యనారాయణపురం లో గల టీసీవీ రెడ్డి ఫంక్షన్ హాల్లో మంత్రి పొంగులేటి ఆధ్వర్యంలో పాలేరు నియోజకవర్గ ముస్లిం సోదరులకు బుధవారం ఇఫ్తార్ విందుని ఇచ్చారు. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ హాజరైన ఈ ఇఫ్తార్ దావత్ లో నియోజకవర్గంలోని సుమారు 1500 మందికి పైగా ముస్లిం సోదరులు, మత పెద్దలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ… ముస్లిం సోదరులు రంజాన్ మాసం అంతా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఆచరించే ముస్లిం సోదరులకు ఇచ్చే ఇఫ్తార్ విందు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయన్నారు. రంజాన్ పండుగ వారి జీవితాలలో సుఖసంతోషాలను నింపాలని ఆ అల్లాహ్ ను కోరుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి, పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ, మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బైరు హరినాథ్ బాబు, ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పాలేరు నియోజకవర్గంలోని ఒక్కో మసీదుకు రూ. లక్ష చొప్పున మంజూరు : మంత్రి పొంగులేటి
మైనార్టీలు కోరిన అన్ని కోరికలు తీర్చేందుకు ఇందిరమ్మ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పొంగులేటి తెలిపారు. కోరిక చిన్నదైనా, పెద్దదైనా వాటిని చిత్త శుద్ధితో నెరవేరుస్తామని తెలిపారు. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీవ్ యువ వికాస్ అనే సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు ఈ పథకంలో ముస్లిం మైనార్టీలకు కూడా న్యాయం జరుగుతుందని తెలిపారు. పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల పరిధిలో సుమారు 40 నుంచి 45 మసీదులు ఉన్నాయని వాటి అభివృద్ధికి ఈ నెల 30న జరుపుకునే రంజాన్ పండుగకు ముందుగానే ఒక్కో మసీదుకి రూ. లక్ష చొప్పున మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. కబర్ స్టాన్ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈద్గా ఏర్పాటుకు కూడా కృషి చేస్తానని తెలిపారు. అనంతరం గత ఏడాది వచ్చిన వరదల్లో తన ప్రాణాలను పణంగా పెట్టి ప్రకాష్ నగర్ బ్రిడ్జి వంతెన పై చిక్కుకున్న కొంతమంది వరద బాధితులను రక్షించిన సుభానిని ప్రత్యేకంగా అభినందించడంతో పాటు అతనికి త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తానని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు.