Seethakka: వాగులో నడిచిన సీతక్క.. బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామని హామీ

పాఠశాల ప్రారంభోత్సవానికి హాజరైన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వాగులో నడుచుకుంటూ వెళ్లారు.

Update: 2024-10-16 13:04 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: పాఠశాల ప్రారంభోత్సవానికి హాజరైన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వాగులో నడుచుకుంటూ వెళ్లారు. పర్యటనలో భాగంగా బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తి చేస్తామని గ్రామస్తులకు మంత్రి హామీ ఇచ్చారు. బుధవారం పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో భాగంగా మంత్రి సీతక్క ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించారు. ఇందులో భాగంగా ఆసిఫాబాద్ మండలం గుండి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ప్రారంభోత్సవానికి హాజరు కావల్సి ఉన్నది. అయితే గుండి గ్రామానికి చేరుకోవాలంటే వాగు దాటి వెళ్లాల్సి ఉంది. బ్రిడ్జి నిర్మాణ పనులు మధ్యలోనే ఆగిపోవడంతో గుండి గ్రామస్తులు వాగులోనే నడుచుకుంటూ వెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి సీతక్క కూడా వాగులో దిగి నడుచుకుంటూ వెళ్లారు. గ్రామస్తుల కష్టాలను గమణించిన మంత్రి ఆగిపోయిన బ్రిడ్జి నిర్మాణం పనుల గురించి అధికారులను ఆరా తీశారు. అనంతరం గుండి గ్రామాన్ని సందర్శించి పాఠశాల ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా వాగుపై బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని గ్రామస్థులకు సీతక్క హామీ ఇచ్చారు.


Similar News