అనుమతులు పరిమితం...అమ్మకాలు అమితం

తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం అగ్రగామిగా ఉంది.

Update: 2024-09-12 13:03 GMT

దిశ, రంగారెడ్డి బ్యూరో/షాద్ నగర్ : తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం అగ్రగామిగా ఉంది. దానిని ఆసరాగా చేసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారులు డబ్బు సంపాదిస్తున్నారు. షాద్ నగర్ నియోజకవర్గంలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న వెంచర్లలో నిబంధనలు గాలికి వదిలేసి ప్లాట్లు క్రయవిక్రయాలు చేస్తున్నా అధికారులు మౌనం వహిస్తున్నారు. కొందుర్గ్ పరిధిలో ఏర్పాటు చేసిన ఇన్క్రీడబుల్ ఇండియా అనుమతులు పరిమితంగా ఉంటే అమ్మకాలు మాత్రం అంతకుమించి ఉన్నాయి. సుమారు 38 ఎకరాల్లో మాత్రమే డీటీసీపీ అనుమతుల్లో ఉన్నాయి. కానీ 421 ఎకరాల విస్తీర్ణంలో వెంచర్ పనులు జరుగుతున్నాయి. వెంచర్ ఇంకా అండర్ డెవలప్మెంట్ ప్రాసెస్ లోనే ఉంది. పూర్తిగా డెవలప్మెంట్ చేసేందుకు ఇంకా సమయం పడుతుంది. కానీ యాజమాన్యం ఇప్పటికే ప్లాట్ల అమ్మకాలు జరుపుతుంది. వాస్తవానికి వెంచర్ డెవలప్మెంట్ కాకుండా ప్లాట్లు విక్రయాలు చేయొద్దనేది నిబంధన. కానీ వెంచర్ యాజమాన్యం వాటిని గాలికి వదిలేసింది.

    దీనికి కొంతమంది అధికారులు వంత పాడడంతో మూడు పువ్వులు ఆరు కాయలుగా రియల్ వ్యాపారం సాగుతుంది. షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గు మండల కేంద్రంలో ఇన్క్రెడిబుల్ ఇండియా పేరుతో సుమారు 400 ఎకరాలకు పైగా వ్యవసాయ పొలంలో వెంచర్ నిర్వహిస్తున్నారు. 20,22,25,26,28,249,254, 265,270,274, 276,277, 278, 282,283, 285, 290, 292,293,295,300,302,372,378,44,46,53,56,59,64,68,69 సర్వే నెంబర్లలో డీటీసీపీ అనుమతి 421 ఎకరాలకు ఉందని బ్రోచర్లో స్పష్టంగా చూపెడుతున్నారు. ఇదిలా ఉంటే అను మతి కేవలం 38 ఎకరాలకు మాత్రమే ఉన్నట్టు సమాచారం. మొత్తం 600 ఎకరాలకు అనుమతులు ఉన్నాయంటూ కస్టమర్లను రియల్ వ్యాపారులు మోసం చేస్తున్నారు. భూములకు రోజురోజుకు రేట్లు పెరుగుతున్నాయి. ప్రజల అవసరాల రీత్యా ఎక్కడో ఒక చోట ప్లాట్ తీసుకోవాలని ఆకాంక్షను రియల్టర్లు ఆసరా చేసుకుంటున్నారు. కనీసం వెంచర్ సైట్ మొత్తంలో ఎక్కడా కూడా ఇన్క్రీడబుల్ ఇండియా పేరు కూడా లేకుండా సుమారు 12000 గజాలు అమ్మినట్టు సమాచారం. డీటీసీపీ, రెరా అనుమతుల ప్రకారం అన్ని పనులు పూర్తయితేనే ప్లాట్ల అమ్మకాలు జరపాలని 15 శాతం గ్రామపంచాయతీకి చేయాలని, మొత్తం పనులన్నీ పూర్తయ్యాక రిలీజ్ చేయాలని ఉంది. కానీ నిబంధనలకు విరుద్ధంగా వెంచర్ వేసి ప్లాట్ల అమ్మకాలు చేపడుతున్నారు. దీనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలకు దారితీస్తుంది.

డీటీసీపీ ఓకే..మరి రెరా అనుమతుల సంగతేంది..

నాలా (నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అసెస్మెంట్ యాక్ట్ చట్టం 2006) ప్రకారం కన్వర్షన్ చేయకుండా వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు వినియోగించరాదని నిబంధనలు ఉన్నప్పటికీ ఆచరణలో అమలుకు నోచుకోవడం లేదు. నాలా చట్టాన్ని అనుసరించి వ్యవసాయ భూములను వ్యవసాయేతర పనులకు ఉపయోగిస్తే ఏక మొత్తంలో ఒకేసారి కన్వర్షన్ చార్జీలను భూమి విలువ పై మూడు శాతం ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. కన్వర్షన్ అనంతరం భూమి ప్లాటుగా మార్చి విక్రయించాలంటే డీటీసీపీ డైరెక్టర్ రేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అనుమతి తప్పనిసరి తీసుకోవాలి. ఎకరం 40 గుంటల స్థలంలో డీటీసీపీకి అనుమతి వెళ్తే 12 శాతం ఓపెన్ స్థలం, 9 శాతం గ్రీనరీ, ఒక శాతం వాటర్ ట్యాంక్, వాణిజ్య అవసరాలకు ఒక శాతం, హెల్త్ సెంటర్, పాఠశాల కోసం స్థలం కేటాయించాల్సి ఉంటుంది.

     నిర్దేశించిన వెడల్పుతో రోడ్లకు స్థలం పోగా ఎకరానికి 24 గుంటలు మాత్రమే మిగులుతుంది. అంతర్గత రోడ్లు 30 ఫీట్ల వెడల్పు, మెయిన్ రోడ్లు, అప్రోచ్ రోడ్లు కనీసం 40 ఫీట్ల వెడల్పుతో ఉండాలని నిబంధనలు ఉన్నాయి. డీటీసీపీ అనుమతి కోసం బెటర్మెంట్ డెవలప్మెంట్ చార్జీల పేరిట భూమి విలువకు అనుగుణంగా ప్రభుత్వానికి ఫీజులు చెల్లించాలి. రెండున్నర ఎకరాల వరకు జిల్లా టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఆఫీసర్, ఎకరంలోపు ఆర్జేడీ, ఐదు ఎకరాలకు పైన డీటీసీపీ హైదరాబాదులో అనుమతి పొందాల్సి ఉంటుంది. నాలాలు, చెరువులు, వాగులు ఉన్న సమీపంలో నీటిపారుదల శాఖ ఎన్ఓసీ, హై టెన్షన్ విద్యుత్ వైర్ల టవర్ సమీపంలో ఉంటే విద్యుత్ శాఖ ఎన్ఓసీ, జాతీయ రహదారులకు సమీపంలో ఉన్న లే అవుట్లకు సంబంధించి నేషనల్ హైవే అథారిటీ ఎన్ఓసీ జత చేయాల్సి ఉంటుంది.

    లే అవుట్ స్థల పరిమాణాన్ని బట్టి మండల సర్వేయర్ డిప్యూటీ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ (సర్వే సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డ్స్) సబ్ డివిజన్ చేయాల్సి ఉంటుంది. పంచాయతీరాజ్ శాఖ అధికారులు అనుమతి జత చేయాల్సి ఉంటుంది. డీటీసీపీ అనుమతి తీసుకున్నట్లు స్పష్టంగా బ్రోచర్లలో చూపిస్తున్నారు. రెరా అనుమతి లేకుండానే వెంచర్లకు జరిగే క్రయ విక్రయాలకు సంబంధించి అగ్రిమెంట్ కాపీలు అందజేయాల్సి ఉంటుంది. ఇవన్నీ జరిగిన తర్వాతనే వెంచర్లలో అమ్మకాలు, కొనుగోలు జరపాల్సి ఉంటుంది. రెరా అనుమతి లేకుండా వెంచర్ల ప్రకటనలు జారీ చేయడం కానీ బ్రోచర్ ముద్రించడం, భూమి అభివృద్ధి చేయడం వంటివి చేయరాదు. కానీ నిబంధనలకు విరుద్ధంగా రెరా అనుమతి లేకుండా వెంచర్లలో ప్లాట్లు అమ్మడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతుంది. సంబంధిత అధికారులు స్పందించి చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.

కస్టమర్లను నిలువు దోపిడీ చేస్తూ...

నిజానికి ఇన్క్రీడబుల్ ఇండియా పేరుతో 32 ఎకరాలలో వెంచర్ ఏర్పాటు చేసింది. కానీ ఎలాంటి డెవలప్మెంట్ పనులు పూర్తి కాలేదు. అయినా రంగురంగుల బ్రోచర్లు చూపి కస్టమర్లకు ప్లాట్లను అంటగట్టేస్తున్నారు. అమ్ముడు పోయాక ఎలాంటి డెవలప్మెంట్ లేకుండానే చేతులెత్తేయడం మామూలే. ఇప్పటికీ ఇలాంటి ఘటనలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక వెంచర్లలో జరిగాయి.  

Tags:    

Similar News