తాండూరు ప్రజల ఆశీస్సులతో అభివృద్ధి చేసి చూపిస్తా : తాండూరు ఎమ్మెల్యే

తాండూరు ప్రజలు నన్ను ఆశీర్వదించి గెలిపించారు..

Update: 2024-09-30 12:48 GMT

దిశ, తాండూరు రూరల్ : తాండూరు ప్రజలు నన్ను ఆశీర్వదించి గెలిపించారు.. తాండూరు నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి చూపిస్తా’ అని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.ఎల్మకన్న సొసైటీ సహకార సంఘం సమావేశం రంగారెడ్డి జిల్లా డీసీసీబీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం తాండూరు పట్టణంలోని సల్లా గార్డెన్ లో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరై మాట్లాడారు..తను డీసీసీబీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మూడు సంవత్సరాల తక్కువ సమయంలోనే సొసైటీ బ్యాంకుల్లో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు.

పేపర్లుకు స్వస్తి చెప్పి సొసైటీలో అన్ని సేవలు కంప్యూటరైజ్డ్ చేయడం జరిగిందని, సొసైటీ పై రైతులకు నమ్మకం కలిగిందన్నారు.డీసీసీబీ బ్యాంక్ టర్నోవర్ 600 కోట్ల నుంచి 2000 కోట్ల వరకు పెంచడం జరిగిందన్నారు. రైతులకు మరింతగా సేవలు అందించాలనే ఉద్దేశంతో త్వరలో లక్ష్మి నారాయణపూర్ దగ్గర మరో నూతన డీసీసీబీ బ్రాంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. చైర్మన్ గా ఉన్నప్పుడు రంగారెడ్డి జిల్లాలో ఉన్న అన్ని సొసైటీలకు గోడౌన్ లు మంజూరు చేయడం జరిగిందని గుర్తు చేశారు.

దేశంలో ఏ ప్రభుత్వం చేయలేని సాహసం సీఎం రేవంత్ రెడ్డి చేయడం జరుగుతుందని, అతి తక్కువ సమయంలోనే మూడు విడతల్లో అర్హులైన ప్రతి రైతుకు రూ. 2 లక్షల లోపు 32 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా ప్రజా పాలన కొనసాగుతుందని తెలిపారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసినట్లు తెలిపారు. రైతుల శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేస్తానని, తనకు పదవి రావడానికి సహకరించిన సీఎం రేవంత్ రెడ్డికి, జిల్లా ఎమ్మెల్యేలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ సమావేశంలో డీసీసీబీ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ళ బాల్ రెడ్డి, వైస్ చైర్మన్ నర్సిరెడ్డి, పార్టీ అధ్యక్షుడు నాగప్ప, మాజీ వైస్ ఎంపీపీ స్వరూప, నాయకులు థారసింగ్, ఉత్తమ్ చంద్, వడ్డే శ్రీనివాస్, శరణు బసప్ప, రాజ్ కుమార్,సీఓ శ్రీనివాస్,డైరెక్టర్లు, సొసైటీ సభ్యులు, రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Similar News