గుర్తు తెలియని పదార్థం సేవించి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యాయత్నం!

ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు గుర్తు తెలియని పదార్థం సేవించి ఆత్మహత్యాయత్నంకు పాల్పడిన ఘటన సరూర్​నగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో సోమవారం సాయంత్రం తీవ్ర కలకలం రేపుతుంది.

Update: 2024-10-01 03:46 GMT

దిశ, బడంగ్‌పేట్​: ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు గుర్తు తెలియని పదార్థం సేవించి ఆత్మహత్యాయత్నంకు పాల్పడిన ఘటన సరూర్​నగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో సోమవారం సాయంత్రం తీవ్ర కలకలం రేపుతుంది. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళ్తే... కర్నూల్​ జిల్లాకు చెందిన వి. వెంకటేశ్వర ప్రసాద్​ (60), వి.లత (55) దంపతులు. వీరికి సందీప్​ (30) , సాయి స్వరూప్​ (28) , వంశీ కృష్ణ (26) లు సంతానం. తొమ్మిదేళ్ళ క్రితం దిల్​ సుఖ్​నగర్​ ప్రాంతానికి వచ్చారు. గత మూడేళ్ల క్రితం సరూర్​నగర్​ కోదండరాం నగర్​ కాలనీకి వెంకటేశ్వర ప్రసాద్​ కిరాణ దుకాణం నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.

పెద్ద కుమారుడు సందీప్​ సాఫ్ట్​ వేర్​ ఉద్యోగి. రెండవ కుమారుడు సాయి స్వరూప్​ తండ్రితో పాటు కిరాణ దుకాణం నడుపుతున్నాడు. చిన్న కుమారుడు వంశీ కృష్ణ ఇటీవలే బీటెక్​ పూర్తి చేశాడు. గత 18 నెలలుగా వెంకటేశ్వర ప్రసాద్​ కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. సోమవారం సాయంత్రం గుర్తు తెలియని పదార్థం ( పిఎస్​ 77) అనే పదార్థాన్ని సేవించి వెంకటేశ్వర ప్రసాద్, లత, సందీప్, సాయి స్వరూప్, వంశీ కృష్ణలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న సరూర్​నగర్​ పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని ఐదుగురిని చికిత్స నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. అందులో తండ్రి వెంకటేశ్వర ప్రసాద్​ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ కేసును సరూర్​నగర్​ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Similar News