సీఎం రేవంత్ రెడ్డిపై పరువునష్టం దావా వేస్తా

సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కొండా సురేఖపై పరువునష్టం దావా వేస్తానని, చారాణా కోడికి బారాణా మసాలా అన్నట్టు ఉంది వీరి పాలన అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.

Update: 2024-10-05 10:38 GMT

దిశ,మహేశ్వరం : సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కొండా సురేఖపై పరువునష్టం దావా వేస్తానని, చారాణా కోడికి బారాణా మసాలా అన్నట్టు ఉంది వీరి పాలన అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల కేంద్రంలో చేపట్టిన రైతు ధర్నాలో మాట్లాడారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ...సీఎం రేవంత్ రెడ్డి ఫోర్త్ సిటీ కోసం ఒక్క ఎకరం భూమిని కూడా సేకరించలేదన్నారు. ఫోర్త్ సిటీ పేరుతో ఫోర్త్ బ్రదర్స్, రియల్ ఎస్టేట్ కోసం అసైన్డ్ మెంట్ భూములను ,పేదల స్థలాలను గుంజుకోవాలని చూస్తున్నారన్నారు. ఫార్మాసిటీని రద్దు చేయాలని గతంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోదండ రెడ్డి డిమాండ్​ చేశారని గుర్తు చేశారు.

     కానీ నేడు ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లోనే ఫోర్త్ సిటీని నిర్మిస్తున్నారన్నారు. ఫార్మాసిటీ భూములను రైతులకు వాపస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి రాగానే రైతు భరోసా, వడ్లకు బోనస్ ఐదు వందలు, రూ.రెండు లక్షల రుణమాఫీ ఇస్తానని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి నేటికీ అమలు చేయలేదన్నారు. కౌలు రైతులకు బోగస్ మాటలు చెప్పాడన్నారు. రాష్ట్రంలో ప్రతి వర్గాన్ని సీఎం మోసం చేశారని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ల కోసం రీజినల్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మారుస్తున్నారని మండిపడ్డారు. ఫోర్త్ సిటీ పేరుతో పేదల భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదన్నారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు.

     రైతులకు కోర్టుల్లో ఇబ్బందులు వస్తే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం అండగా ఉంటుందన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేయలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తానన్న హామీని నెరవేర్చకుండా గత 40 ఏండ్ల నుంచి పేద ప్రజలు నివసిస్తున్న ఇండ్లను హైడ్రా పేరుతో కూలగొడుతున్నారన్నారు. కమీషన్ల కోసమే మూసీ సుందరీకరణ చేపడుతున్నారని పేర్కొన్నారు. పేద ప్రజలపైన ప్రేమ ఉంటే ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరాలన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహముద్ అలీ, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్, జైపాల్ యాదవ్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, మెతుకు ఆనంద్, మహేష్ రెడ్డి, ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, శంబిపూరి రాజు, నవీన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్తీక్ రెడ్డి, చిలకమర్రి నర్సింహ, రజిని సాయిచంద్, పలువురు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.  

Tags:    

Similar News