Health Minister: 85 శాతం పేషెంట్లకు జిల్లాల్లోనే క్వాలిటీ వైద్యం

85 శాతం మంది రోగులకు జిల్లాల్లోనే వైద్యం అందించాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యం అని, ఈ లక్ష్యం నెరవేరాలంటే జిల్లా, ఏరియా హాస్పిటళ్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ(Health Minister Damodara Raja Narasimha) సూచించారు.

Update: 2024-10-22 17:09 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: 85 శాతం మంది రోగులకు జిల్లాల్లోనే వైద్యం అందించాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యం అని, ఈ లక్ష్యం నెరవేరాలంటే జిల్లా, ఏరియా హాస్పిటళ్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ(Health Minister Damodara Raja Narasimha) సూచించారు. మంగళవారం ఆయన హైదరాబాద్ లోని ఆరోగ్య శ్రీ ట్రస్ట్ ఆఫీస్ లో తెలంగాణ వైద్య విధాన పరిషత్, టీచింగ్ హాస్పిటల్స్ ఉన్నతాధికారులతో రివ్యూ నిర్వహించారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ ను సెకండరీ హెల్త్ కేర్‌ డైరెక్టరేట్‌ గా బలోపేతం చేయడానికి అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) రూపొందించిన ప్రతిపాదనలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టీవీవీపీ పరిధిలో ఉన్న జిల్లా, ఏరియా హాస్పిటళ్లలోనే ఎక్కువ మంది రోగులు చికిత్స పొందుతున్నారని, ఈ నేపథ్యంలో ఆయా హాస్పిటళ్లలో అన్ని రకాల వసతులు అందుబాటులో ఉండాలన్నారు. ప్రస్తుత అవసరాలను మాత్రమేగాకుండా, భవిష్యత్ అవసరాలు, ఓపీ, ఐపీ, బెడ్‌ స్ట్రెంత్‌ను కూడా దృష్టిలో పెట్టుకుని ప్రతిపాదనల్లో మార్పులు చేయాలని సూచించారు.

ఇండియన్ పబ్లిక్ హెల్త్‌ స్టాండర్డ్స్‌ (ఐపీహెచ్‌ఎస్‌) ప్రకారం హాస్పిటల్స్‌లో క్లినికల్, నాన్ క్లినికల్ స్టాఫ్ ప్యాటర్న్ ఉండాలన్నారు. ఈ మేరకు అవసరమైన అదనపు పోస్టులను మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. డాక్టర్లు, ఇతర ఉద్యోగుల ప్రమోషన్లు, ఇతర సర్వీసు మ్యాటర్స్‌లో ఇబ్బందులు, లీగల్ చిక్కులు తలెత్తకుండా ప్రతిపాదనలు ఉండాలన్నారు. ఏపీలో వీవీపీని సెకండరీ హెల్త్ కేర్‌‌గా మార్చినట్టు అధికారులు మంత్రి దృష్టికి తీసుకురాగా, అక్కడ తలెత్తిన అంశాలను పరిగణలోకి తీసుకుని, అవి రిపీట్ అవకుండా జాగ్రత్త పడాలని సూచించారు. ఇక చాలా చోట్ల డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్‌ టీచింగ్ హాస్పిటల్స్‌ కిందకు వెళ్లిపోయాయని, కొన్ని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు వీవీపీ పరిధిలోకి వచ్చాయని అధికారులు మంత్రికి తెలిపారు. వీవీపీ పరిధిలోకి వచ్చిన పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలకు అవసరమైన స్టాఫ్‌తోపాటు, ఏమేం ఎక్విప్‌మెంట్ అవసరమో ప్రతిపాదనలు రూపొందించాలని మంత్రి సూచించారు. జనరల్ మెడిసిన్, సర్జరీ, గైనిక్, పీడియాట్రిక్ వంటి బేసిక్ వైద్య సేవలు అన్నీ వీవీపీ హాస్పిటళ్లలో అందుబాటులో ఉండాలన్నారు.

ఎంజీఎం పై ఫైర్.. త్వరలో విజిట్..

ఎంజీఎం హాస్పిటల్‌లో రోగుల ఇక్కట్లపై ఆరా తీసిన మంత్రి, అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వైద్య సేవలు అందించే విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వాలు ఎన్ని కోట్లు ఖర్చు చేసినా, అంతిమంగా ప్రజలకు వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత అధికారులు, డాక్టర్లదేనన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, వాటిని పరిష్కరించే బాధత్య తమదన్నారు. ఏయే సమస్యలు ఉన్నాయో, ఏమేమి అవసరాలు ఉన్నాయో రెండ్రోజుల్లో పూర్తి వివరాలతో ప్రతిపాదనలు అందించాలని మంత్రి ఆదేశించారు. కొత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులోకి వచ్చే వరకూ ఇప్పుడున్న హాస్పిటల్స్‌లో రోగులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వైద్య సేవలు అందించాలన్నారు.

ఇందుకోసం అవసరమైన రిపేర్లు చేయించాలని అధికారులకు సూచించారు. పేషెంట్ల పట్ల సానుభూతితో, చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. అధికారుల మధ్య సమన్వయ లోపం ఉండకూడదన్నారు. త్వరలో స్వయంగా తానే ఎంజీఎంకు వస్తానని, అన్ని వార్డులు పరిశీలిస్తానని మంత్రి తెలిపారు. కేఎంసీ పరిధిలోని 5 హాస్పిటల్స్‌లో 1525 బెడ్లు అందుబాటులో ఉన్నాయని మంత్రికి అధికారులు వివరించారు. ఇందుకు అనుగుణంగా ఏమేం కావాలో ప్రతిపాదనలు పంపాలని అధికారులకు మంత్రి సూచించారు. ఈ సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చొంగ్తూ, కమిషనర్ కర్ణన్ టీజీఎంఎస్ ఐడీసీ ఎండీ హేమంత్, కేఎంసీ ప్రిన్సిపాల్ రామ్‌కుమార్, ఎంజీఎం సూపరింటెండెంట్ మురళి, టీబీ హాస్పిటల్ సూపరింటెండెంట్ సునీత, సీకేఎం హాస్పిటల్ సూపరింటెండెంట్ షర్మిల తదితరులు పాల్గొన్నారు.


Similar News