ఎస్సీ వర్గీకరణ పూర్తయ్యే వరకు గ్రూప్ 2, 3 పరీక్షలు వాయిదా వేయండి : సీఎం రేవంత్ రెడ్డికి ఎస్సీ విద్యార్థుల లేఖ
ఎస్సీ వర్గీకరణ అమలు జరిగే వరకు గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలను వాయిదా వేయాలని ఎస్సీ సామాజిక విద్యార్థులు సీఎం రేవంత్రెడ్డికి లేఖ రాశారు.
దిశ, వెబ్ డెస్క్ : ఎస్సీ వర్గీకరణ అమలు జరిగే వరకు గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలను వాయిదా వేయాలని ఎస్సీ విద్యార్థులు సీఎం రేవంత్రెడ్డికి లేఖ రాశారు. సుప్రీంకోర్టు ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం వర్గీకరణపై చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో, దీన్ని త్వరలో జరుగబోయే పరీక్షల్లోనూ అమలు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనను ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ అమలులోకి వచ్చిన తర్వాతే గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలు నిర్వహించి.. ఎస్సీ సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు దక్కేలా చేయాలని లేఖలో కోరారు. ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో రాబోయే నోటిఫికేషన్లో ఖాళీల సంఖ్య తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, వర్గీకరణ అమలయ్యే వరకు పరీక్షలను వాయిదా వేసి, అదనపు పోస్టులతో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేయాలని విద్యార్థులు లేఖలో విజ్ఞప్తి చేశారు.