Gussadi Kanakaraju: గుస్సాడీ కనకరాజుకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మర్లవాయి గ్రామానికి చెందిన గుస్సాడీ కనకరాజు(70) శుక్రవారం అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు.

Update: 2024-10-26 04:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆసిఫాబాద్ (Asifabad) జిల్లా జైనూర్ మండలం మర్లవాయి గ్రామానికి చెందిన గుస్సాడీ కనకరాజు(70) శుక్రవారం అనారోగ్యంతో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన భౌతిక కాయానికి ఈ (శనివారం) మర్లవాయిలో ఆదివాసీల సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రతి ఏటా దీపావళి సమయంలో గుస్సాడీ నృత్యంతో అందరినీ అలరించే కనకరాజు ఈసారి పండగ ముందే మరణించడంతో ఆదివాసీ గూడెలన్నీ శోకసంద్రంలో మునిగిపోయాయి. ఆదివాసీల గుస్సాడీ నృత్యానికిగానూ 2021లో కనగరాజును భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ అవార్డుతో సత్కరించింది.

ఇక గుస్సాడీ నృత్య కళాకారుడు, పద్మశ్రీ గుస్సాడీ కనకరాజు (Gussadi Kanakaraju) మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy).. గుస్సాడీ నృత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయటంతో పాటు తెలంగాణ కళలను, సంస్కృతి - సంప్రదాయాలను కాపాడిన అసామాన్యుడు కనకరాజు అని, ఆయన మరణం తెలంగాణ కళలకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. గుస్సాడీ నృత్య ప్రదర్శనలతో పాటు ఇతరులకు నేర్పించటంలోనూ కనకరాజు తన విశేష సేవలు అందించారని గుర్తు చేసుకున్నారు.

అంతరించిపోతున్న ఆదివాసీ (Aadivasi) కళకు దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన కళాకారుడు కనకరాజని, ఆయన మరణం ఆవేదన కలిగించిందని సంతాపం వ్యక్తం చేశారు. కనకరాజు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం గుస్సాడీ కనకరాజుకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు.


Similar News