సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడికైనా సిద్ధం.. మాజీ ఎమ్మెల్యే సురేందర్..

రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడించి అయినా సరే రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు తమ పోరాటం ఆగదని మాజీ ఎమ్మెల్యే సురేందర్ అన్నారు.

Update: 2024-09-30 11:14 GMT

దిశ, గాంధారి : రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడించి అయినా సరే రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు తమ పోరాటం ఆగదని మాజీ ఎమ్మెల్యే సురేందర్ అన్నారు. వివరాలలోకి వెళితే కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో అఖిలపక్ష ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన రైతుమహాధర్నా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ రైతులను నట్టేట ముంచుతుందని అన్నారు. ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఉచిత ఆరు గ్యారంటీల ఊసే లేదని, అటు ప్రజలను, రైతులను నిలువునా మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని అన్నారు.

అంతే కాకుండా ఎవరికి కూడా పింఛన్లు సరిగా రావడం లేదని, రైతు పెట్టుబడి సాయం అందడం లేదని, ఆరు పథకాలు అమలు కావడం లేదని, రుణమాఫీ అందరికీ జరగలేదని అన్నారు. ఇంత ఎండలో ప్రజలు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి మళ్లీ కాంగ్రెస్ పార్టీతోనే మొదలవుతుందని ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రం కోసం ధర్నాలు రాస్తారోకోలు చేశామని, కానీ ఇప్పుడు ప్రభుత్వం మారిన పాపానికి ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు రోడ్డున ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, బీజేపీ కార్యకర్తలు, నాయకులు, అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు.


Similar News