ఆటోను ఢీకొట్టిన ఎమ్మెల్యే కాన్వాయ్
నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం లింగంపల్లి శివారులో బోధన్ ఎమ్మెల్యే కాన్వాయ్ లోని కారు ఆటోను ఢీకొట్టింది.
దిశ, ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం లింగంపల్లి శివారులో బోధన్ ఎమ్మెల్యే కాన్వాయ్ ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో తృటిలో ప్రాణాపాయం తప్పింది. సోమవారం మధ్యాహ్నం బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కోటగిరి మండలంలో ఒక కార్యక్రమానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కాన్వాయ్లోని ఓ కారు ఆటోను బలంగా ఢీకొట్టడంతో ఆటో పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ఆటోడ్రైవర్కు గాయాలు కాగా ఆయన్ని సమీప ఆస్పత్రికి తరలించారు. కారులోని ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో దాంట్లో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు. కాగా, ఈ ప్రమాదంపై రుద్రూర్ ఎస్సై మహేందర్ను వివరణ కోరగా.. ప్రమాదం జరిగింది వాస్తవమేని, ఆటో డ్రైవర్కు గాయాలైతే ఆసుపత్రికి తరలించామని చెప్పారు. కానీ ఈ యాక్సిడెంట్పై మాకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని తెలిపారు.