గాంధారి మండలంలో కలెక్టర్ పర్యటన.. అధికారులకు కీలక సూచనలు

కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో గురువారం కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ పర్యటించారు. ఈ క్రమంలో ముదోలి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు.

Update: 2024-10-17 14:28 GMT

దిశ, గాంధారి: కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో గురువారం కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ పర్యటించారు. ఈ క్రమంలో ముదోలి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పేద వర్గాల పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు పోషకాహారం అందించడం జరుగుతున్నదని, వాటిని సక్రమంగా అందించాలని సూచించారు. చిన్నారులకు ఆటపాటలు, విద్యాబుద్దులు నేర్పించాలని తెలిపారు. కేంద్రంలో 25 మంది పిల్లలను నమోదు చేయగా 17 మంది మాత్రమే అటెండెన్స్ ఉందని, మిగతా పిల్లలను కేంద్రాలకు వచ్చే విధంగా చూడాలని అన్నారు. ఆరోగ్యవంతంగా లేని పిల్లలకు బాలామృతం అందించాలని తెలిపారు. పోషకాహార లోపం కలిగిన పిల్లల్ని స్థానికులు దత్తత తీసుకొని న్యూట్రిషన్ అందే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేయాలని, కేంద్రానికి రాని పిల్లలను వచ్చే విధంగా వారి పోషకులకు అవగాహన కల్పించాలని సూపర్వైజర్లతో అన్నారు. అనంతరం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల‌ను కలెక్టర్ పరిశీలించారు. తరగతి గదులు శుభ్రంగా లేవని, వాటిని శుభ్రపరచాలి ప్రిన్సిపాల్‌కు తెలిపారు. గతంలో పాఠశాలల్లో చేపట్టిన పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి

వరి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సీతాయిపల్లి గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు కావలసిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని, వర్షాలు కురుస్తున్న తరుణంలో ధాన్యం తడవకుండా టార్పాలిన్ సిద్ధంగా ఉంచుకోవాలని, ధాన్యం తూకం వేయడానికి వేయింగ్ మిషన్, గాని సంచులు, తదితర ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు. వరి పంటను రైతులు ఆరబెట్టుకొని సెంటర్‌కు తీసుకురావాలని సూచించారు. అలాగే ధాన్యం ను శుభ్రం చేసుకొని వచ్చే విధంగా రైతులకు సూచించాలన్నారు. ప్రతి రైతుకు టోకెన్ జారీ చేయాలని సూచించారు. కొనుగోలు చేసిన వరి ని వెంటనే సంబంధిత రైస్ మిల్లులకు తరలించాలని, ప్రతీ సంచిపై సెంటర్ నెంబర్, జిల్లా కోడ్‌ను వేయాలని తెలిపారు. వరి ధాన్యం సేకరణ సజావుగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు ఆర్డీఓ ప్రభాకర్, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, తహసీల్దార్ సతీష్ రెడ్డి, ఎంపీడీవో రాజేశ్వర్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ రాజేందర్, పౌరసరఫరాల అధికారులు, జిల్లా సహకార అధికారి, గ్రామస్తులు, రైతులు, అధికారులు పాల్గొన్నారు.


Similar News