పెళ్లి కావడం లేదని యువకుడు ఆత్మహత్య

పెళ్లి కావడం లేదనే మనస్థాపంతో యువకుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.

Update: 2024-02-27 16:00 GMT

దిశ, భిక్కనూరు : పెళ్లి కావడం లేదనే మనస్థాపంతో యువకుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... గ్రామానికి చెందిన కోడూరి శ్రీకాంత్ గౌడ్(32)కి చిన్నతనంలోనే తండ్రి మరణించాడు. కుటుంబ భారం మీద పడడంతో ఉపాధి అవకాశాల కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లాడు. 15 సంవత్సరాల పాటు గల్ఫ్ దేశంలో ఉండగా శ్రీకాంత్ తన ఇద్దరు చెల్లెళ్ల పెళ్లి చేశాడు. ఆ తరువాత గ్రామంలో ఇల్లు కట్టుకున్నాడు.

    పెళ్లి చేసుకొని స్వదేశంలో సెటిల్​ కావాలన్న ఉద్దేశంతో ఏడాది క్రితం స్వగ్రామానికి వచ్చాడు. అప్పటినుంచి పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పటికి, సరైన అమ్మాయి దొరకకపోవడంతో గత కొంతకాలంగా మానసికంగా కృంగిపోయాడు. తన తల్లి నర్సవ్వ బీడీలు చుట్టేందుకు బయటకు వెళ్లగా, అదే సమయంలో ఇంట్లోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్దిసేపటి తరువాత ఇంట్లోకి వచ్చిన తల్లి కుమారుడు ఉరి పెట్టుకోవడాన్ని చూసి బోరున విలపించింది. చుట్టుపక్కల వారికి, కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. శ్రీకాంత్ గౌడ్ ఆత్మహత్యతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ మేరకు భిక్కనూరు ఎస్ ఐ (2) రాంచందర్ నాయక్ ఆధ్వర్యంలోని పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. 


Similar News