తెలంగాణలో ఆటో డ్రైవర్లు, ఓనర్లకు కొత్త నిబంధన

జీరో పొల్యూషన్‌పై రావాణా శాఖ దృష్టి సారించింది. పెట్రోల్, డీజిల్ ఆటోల నుంచి పొల్యూషన్ ఎక్కువగా వస్తుందని.. వాటి స్థానం

Update: 2024-10-12 02:08 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: జీరో పొల్యూషన్‌పై రావాణా శాఖ దృష్టి సారించింది. పెట్రోల్, డీజిల్ ఆటోల నుంచి పొల్యూషన్ ఎక్కువగా వస్తుందని.. వాటి స్థానంలో ఎలక్ట్రిక్ వెహికిల్స్ తీసుకురావాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. అందులో భాగంగానే కొత్త ఆటోలకు నో పర్మిట్ నిబంధన తేవాలని భావిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేవారికి ప్రోత్సాహకాలపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లు విశ్వసనీయ సమాచారం.

రవాణాశాఖ ఇప్పటికే స్ర్కాబ్ పాలసీని తీసుకొచ్చింది. గడువు తీరిన ద్విచక్రవాహనాలు, ట్రాన్స్ పోర్టు వాహనాలు స్క్రాబ్ చేస్తే రాయితీలను ప్రకటించింది. మరో అడుగు ముందుకేసి జీరో పొల్యూషన్ పై ప్రత్యేక దృష్టిసారించింది. దీంతో కొత్తగా డీజిల్, పెట్రోల్ ఆటోలను కొనుగోలు చేసేవారికి నోపర్మిట్ నిబంధన అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా 5లక్షల 733 ఆటోలు ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం గ్రేటర్ పరిధిలో 1.5లక్షల ఆటోలు రిజిస్టర్ అయి ఉన్నట్లు సమాచారం. దీంతో పొల్యూషన్ పెరుగుతుందని భావించిన ప్రభుత్వం వాటి నివారణకు చర్యలు చేపట్టినట్లు తెలిసింది. కొత్తగా కొనుగోలు చేసేవారికి ‘నో ఫర్మిట్’ నిబంధన అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

గ్రేటర్ లో 5 ఆర్టీవోల పరిధిలో..

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 5 ఆర్టీవో కార్యాలయాల పరిధిలో ప్రస్తుతం నోఫర్మిట్ నిబంధన కొనసాగుతోంది. సికింద్రాబాద్, ఖైరతాబాద్, మెహదీపట్నం, బండ్లగూడ, మలక్ పేట ఆర్టీఓ కార్యాలయాల్లో పాత ఆటోలను స్క్రాప్ చేసి సర్టిఫికెట్ చూపితేనే ఆటో యజమానికి లేదా డ్రైవర్ కు కొత్త ఆటోకు పర్మిట్ ఇస్తున్నారు. ఈ నిబంధన గ్రేటర్ పరిధిలోని మిగిలిన ఆర్టీఓ కార్యాలయాల పరిధిలో అమలు కావడం లేదు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిబంధనను తీసుకొస్తే డిజిల్, పెట్రోల్ ఆటోలను నియంత్రించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు పెంచే ఆలోచన

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీలోనూ ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చింది. ప్రస్తుతం ప్రయాణీకులకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇప్పటికే జిల్లాకు 25వరకు ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం డీజిల్ తో నడిచే బస్సుల కాలపరిమితి సైతం దగ్గరపడుతుండటంతో వాటి స్థానంలో బ్యాటరీతో నడిచే బస్సులను తీసుకురానున్నట్లు ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. పబ్లిక్ ట్రాన్స్ పోర్టులో ఆటోల ఉపయోగం ఎక్కువగా ఉండటంతో తొలుత వాటి స్థానంలో ఎలక్ట్రిక్ ఆటోలను ప్రోత్సహిస్తామని, కొనుగోలుదారులకు ప్రోత్సాహకాలపై సైతం ఆలోచన చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఏదీ ఏమైనా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తామని రాష్ట్రప్రభుత్వం పేర్కొనడం శుభతరుణమని, పొల్యూషన్ ను తగ్గించవచ్చని పర్యావరణ వేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పొల్యూషన్‌కు చెక్ పెట్టేలా..

రాష్ట్రంలో పొల్యూషన్ పెరుగుతోందని పర్యావరణశాఖ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దాంతో భవిష్యత్ తరాల మనుగడకు ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా డీజిల్, పెట్రోల్ ఆటోల నియంత్రణపై ఫోకస్ పెట్టింది. ఎలక్ట్రిక్ ఆటోలు అయితే జీరో పొల్యూషన్ ఉంటుందని వాటిని ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఎలక్ట్రిక్ ఆటోలు కొనుగోలు చేసేవారికి నోఫర్మిట్ నిబంధన వర్తించదు. ఒక వ్యక్తి అవసరం మేరకు ఆటోలను తీసుకోవచ్చు. అంతేగాకుండా డీజిల్, పెట్రోల్ ఆటోల కొనుగోలు అయ్యే ఖర్చుకంటే సుమారు 2.5లక్షలు తగ్గనున్నట్లు సమాచారం. అంతేగాకుండా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేవారికి రిజిస్ట్రేషన్ గానీ, లైఫ్ ట్యాక్సీ, లైసెన్స్ ఇతరాత్రాలో రాయితీలు ఇచ్చేందుకు కూడా అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.


Similar News