నాగార్జున సాగర్ లోతట్టు ప్రాంతాల ప్రజలు అలెర్ట్ గా ఉండాలిః కలెక్టర్ సి.నారాయణరెడ్డి

Update: 2024-08-31 15:44 GMT

దిశ, నల్లగొండ : జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి పలు సూచనలు చేశారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి అవసరమైనచోట సహాయ సహకారాలు అందించాలన్నారు. మరో రెండు రోజులపాటు వర్షాలు కురియనున్న దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మట్టి మిద్దెలు ,కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న ఇండ్లలో ఎవరు నివాసం ఉండొదని చెప్పారు. మున్సిపల్, గ్రామపంచాయతీ అధికారులకు తెలియజేస్తే అవసరమైతే తక్షణమే వసతి కల్పిస్తామన్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు, మూసి ప్రాజెక్టుల గేట్లు తెరిచినందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రాజెక్టు పరివాహక ప్రాంతాలు, నది పరివాహక ప్రాంతాలలో నీటిలోకి ఎవరు వెళ్లొద్దని, పశువులను సైతం నీటిలోకి తీసుకెళ్లొద్దని కోరారు. విద్యుత్ అధికారులు ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉన్న వాటిని గుర్తించి ముందే తొలగించాలని ఆదేశించారు. కల్వర్టులు, రోడ్లు పొంగిపొర్లుతున్నట్లయితే వాటిని దాటే సాహసం ఎవరు చేయొద్దన్నారు. వర్షాల కారణంగా సీజనల్ వ్యాధుల బారిన పడిన ప్రజలకు తక్షణ చికిత్స అందించేందుకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అవసరమైన మందులు, మెడికల్ కిట్లు సిద్ధంగా ఉంచుకోవాలని కోరారు. రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండి అవసరమైనచోట సహాయక చర్యలను చేపట్టాలన్నారు. జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులు అందరూ జిల్లా యంత్రంగానికి అందుబాటులో ఉండాలని ఆదేశించారు.


Similar News