కాపర్‌ కేటుగాళ్ల..గుట్టు రట్టు

సుమారు రూ 3,60,000 విలువ గల కాపర్ వైర్ ను దొంగతనం చేసిన ఐదుగురు నిందితులను మునగాల పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

Update: 2024-10-22 14:45 GMT

దిశ,కోదాడ : సుమారు రూ 3,60,000 విలువ గల కాపర్ వైర్ ను దొంగతనం చేసిన ఐదుగురు నిందితులను మునగాల పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. అనంతరం కోదాడ డిఎస్పి కార్యాలయం ఏర్పాటు చేసిన విలేఖరు ల సమావేశం లో డిఎస్పీ శ్రీధర్ రెడ్డి నిందితుల వివరాలు వెల్లడించారు. మునగాల మండలం గ్రామ శివారులో నాగార్జునసాగర్ ఎడమ కాలువపై గల ఆర్-9 లిఫ్ట్ కలకోవా రైతు రక్షణ కమిటీ ఎత్తిపోతల పథకం లిఫ్టుకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ లో కాపర్ వైరు దొంగతనం చేసినట్లు లిఫ్ట్ అధికారులు, చైర్మన్ జనవరి నెలలో మునగాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు.ఈ కేసు విచారణ కొనసాగుతుండగా.. మంగళవారం ఉదయం మునగాల ఎస్ఐ తన సిబ్బందితో కలిసి జాతీయ రహదారి మొద్దుల చెరువు స్టేజి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా.. రెండు ద్విచక్ర వాహనాలపై వస్తున్న ఐదుగురు వ్యక్తులను అనుమానించి అదుపులోకి తీసుకున్నట్టుగా విచారించారు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలానికి చెందిన ముప్పారం గ్రామానికి చెందిన కొంచెం కోటేష్, రూపాని గోపి, రూపాని నాగయ్య, వరికోప్పల శ్రీను, కొంచెం విజయ్ ,వ్యక్తులుగా గుర్తించినట్లు తెలిపారు. ఈ అయిదుగురు నల్లగొండ ,సూర్యపేట జిల్లాలలోని కాలవలపై వేసిన ట్రాన్స్ఫార్మర్లను లక్ష్యంగా చేసుకొని రెక్కి నిర్వహించి.. కాపర్ వైరును దొంగతనం చేస్తున్నట్లుగా విచారణలో గుర్తించినట్లుగా తెలిపారు. వీరిపై మునగాల, నడిగూడెం ,పెనపహాడ్ పోలీస్ స్టేషన్లో పలు కేసులు నమోదై ఉన్నాయని తెలిపారు. నిందితులపై గతంలో ఇదే రకమైన కేసులు మిర్యాలగూడెం, వేములపల్లి ,నేలకొండపల్లి, త్రిపురవరం పోలీస్ స్టేషన్ పరిధిలో సైతం ఐదు కేసులలో నిందితులుగా ఉన్నట్లు తెలిపారు. నిందితుల వద్ద నుంచి మూడు లక్షల అరవై వేల రూపాయల విలువగల రెండు క్వింటాల 20 కేజీల కాపర్ వైరు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. ఈ కేసులో చాకచక్యంగా పనిచేసిన సిబ్బందిని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ అభినందించి రివార్డ్ అందించారు. ఈ సమావేశం లో మునగాల సీఐ రామకృష్ణ రెడ్డి, ఎస్ ఐ ప్రవీణ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.


Similar News