త్వరలో పదేళ్ళ కష్టాలకు ముగింపు.. రోల్ మోడల్ గా కొత్త రెవెన్యూ చట్టం: మంత్రి పొంగులేటి

రాష్ట్రంలో గత పదేండ్ల నుంచి ధరణి పోర్టల్, ఆర్ఓఆర్ చట్టం - 2020 ద్వారా ప్రజలు పడుతున్న కష్టాలు, బాధల నుంచి విముక్తి కల్పించేలా దేశానికి రోల్ మోడల్ గా ఉండేలా త్వరలో కొత్త రెవెన్యూ చట్టం-2024 ను తీసుకురాబోతున్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.

Update: 2024-10-06 12:48 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో గత పదేండ్ల నుంచి ధరణి పోర్టల్, ఆర్ఓఆర్ చట్టం - 2020 ద్వారా ప్రజలు పడుతున్న కష్టాలు, బాధల నుంచి విముక్తి కల్పించేలా దేశానికి రోల్ మోడల్ గా ఉండేలా త్వరలో కొత్త రెవెన్యూ చట్టం-2024 ను తీసుకురాబోతున్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. గత ప్రభుత్వం అమలు చేసిన ధరణి తో సామాన్య ప్రజలు, రైతులు ఇబ్బందులు అభద్రతాభావానికి గురయ్యారని, వారు ఎదుర్కొన్న రెవెన్యూ సమస్యల నుంచి విముక్తి కల్పిస్తామని ఇందుకోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. 272 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కల్లెక్టర్లు, డిప్యూటీ కల్లెక్టర్లతో మంత్రి ఆదివారం ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ముఖాముఖి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ విధానాలను విశ్వసించి అధికారం అప్పగించారో ఆ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి సామాన్యుడికి అందుబాటులో ఉండేలా రెవెన్యూ సేవలను తీసుకొస్తున్నామన్నారు. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమిస్తాం. కొత్త రెవెన్యూ చట్టం రాకముందే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటాం. గత ప్రభుత్వం తొందరపాటు నిర్ణయాలతో రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించింది. సామాన్యులకు రెవెన్యూ సేవలను దూరం చేసింది. ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా మా ప్రభుత్వం ఉద్యోగులను, మేధావులను, ఇలా అందరినీ సంప్రదించి వారి సూచనలను, సలహాలను స్వీకరించింది. చట్టం కూడా తుది దశకు చేరుకుంది. 2020 రెవెన్యూ చట్టంలో ప్రజలకు మేలు చేసే ఏమైనా మంచి అంశాలు ఉంటే, ఎలాంటి భేషజాలకు పోకుండా కొత్త చట్టంలో పొందుపరుస్తామన్నారు.

రాజీపడకుండా భూముల రక్షణ

ప్రభుత్వ భూముల పరిరక్షణలో ఏమాత్రం రాజీ పడొద్దని, ఈ భూముల పరిరక్షణ కోసం అధికారుల సూచన మేరకు ప్రతి మూడు నెలలకోసారి రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో కోర్టుకు సంబంధించిన భూముల విషయంలో లీగల్ టీంతో సమావేశం నిర్వహిస్తామని మంత్రి ప్రకటించారు. రాష్ట్ర స్థాయిలో జరిగే సమావేశంలో స్వయంగా పాల్గొంటానన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఎవరూ రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న, ఎవరు కూడా ప్రభుత్వ భూముల రికార్డులను టాంపరింగ్ చేయకుండా ఉండేలా యుద్ధ ప్రాతిపదికన రెవెన్యూ రికార్డులను డిజిటలైజేషన్ చేపడుతామన్నారు. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారితో పాటు, సర్వీస్ లో ఉన్న ప్రతి ఒక్కరికీ శిక్షణ తప్పనిసరిగా చేస్తాం. రెవెన్యూ విభాగం ఉద్యోగులకు సంబంధించి జాబ్ చార్ట్ రూపొందించాలని, ఇందుకోసం ఒక కమిటీని ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలన్నారు. ఈ ప్రభుత్వానికి కండ్లు, చెవులు రెవెన్యూ ఉద్యోగులే. బాగా పని చేస్తేనే ప్రజలకు మేలు కలగడంతో పాటు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు.

అక్కున చేర్చుకోండి

గత పది సంవత్సరాల నుంచి అనుభవిస్తున్న గోసను చెప్పుకోడానికి రెవెన్యూ కార్యాలయాలకు వచ్చే సామాన్యులను అక్కున చేర్చుకోవాలని, వారితో ఫ్రెండ్లీగా వ్యవహరించాలని మంత్రి అధికారులను కోరారు. గతానికి ప్రస్తుతానికి తేడా కనబడాలి. వచ్చిన ప్రతి మనిషిని గౌరవించాలి. వ్యవస్థలో ఒకరిద్దరు తప్పు చేయడం వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుందన్నారు. జాగ్రత్తగా పని చేయాలని, ప్రజలకు సేవ చేసే విషయంలో మీ రోల్ ప్రధానమైందన్నారు. మీరు వేసే ప్రతి అడుగు ప్రతి పని రెవెన్యూ వ్యవస్థకు వన్నె తెచ్చేలా ఉండాలి.

అప్పులు చేసి సచివాలయ నిర్మాణం

ఉద్యోగుల సమస్యలకు సంబంధించి ఆర్థికేతర అంశాలను తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నాను. ఆర్థిక పరమైన అంశాలలో కొంత ఆలోచన చేస్తాం కానీ ఉద్యోగుల పదోన్నతులు వంటి అంశాలను తక్షణమే పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. 33 జిల్లాల్లో సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులను క్రియేట్ చేస్తాం. అలాగే 17 మంది రెవెన్యూ అధికారులకు ఐఏఎస్ హోదా కల్పించడానికి చర్యలు తీసుకుంటాం. ఎన్నికల సమయంలో బదిలీ అయిన తహశీల్దార్లను పూర్వ స్థానాలకు బదిలీ చేయడానికి దసరాలోపే నిర్ణయం తీసుకుంటాం. ఉద్యోగులు చెప్పినట్టుగా యూనిఫార్మ్ గా అందరికీ ఒకే రకమైన వాహనాలు ఉండాలన్న ఆలోచన చాలా మంచిదే, కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలన్నారు.

వాహనాల అద్దె లకు సంబంధించి ఈ నెల చివరి వరకు 50% క్లియర్ చేస్తామన్నారు. గత ప్రభుత్వం మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలను పెంచింది కానీ అక్కడ మౌలిక సదుపాయాలను విస్మరించింది. దాదాపు 200 మండలాలకు సొంత భవనాలు లేవు. గత ప్రభుత్వం మాదిరిగా ఆర్భాటాలకు, హెచ్చులకు పోవద్దు. అప్పులు చేసి ఉన్న బిల్డింగ్ లను కూలగొట్టి సెక్రటేరియట్ ను నిర్మించడం అవసరమా ? అన్నారు. కొన్ని జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాలు ఉన్నా కూడా కొత్తవి నిర్మించారు. లేని దగ్గర కట్టడం అవసరమే, కానీ ఉన్నవాటిని కూల్చి కట్టడం అవసరమా ? ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడం కాదా? నేనైతే ఇటువంటి పనులు చేయనన్నారు.

9 నెలల్లో సంస్కరణలు: నవీన్ మిట్టల్

గత తొమ్మిది నెలల్లో రెవెన్యూ శాఖ మంత్రి ఆధ్వర్యంలో ప్రజలకు అనువైన విధంగా రెవెన్యూ సంస్కరణలు చేపట్టామని రెవెన్యూ శాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ అన్నారు. దాదాపు 3.50 లక్షల ధరణి ధరఖాస్తులను పరిష్కరించామన్నారు. సమావేశంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, తెలంగాణ డిప్యూటీ కల్లెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వి. లచ్చి రెడ్డి, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్ , డిప్యూటీ కల్లెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కే. చంద్రమోహన్, ప్రధాన కార్యదర్శి డి.శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి ఏ భాస్కరరావు, ఎస్టేట్ ఆఫీసర్ కే చంద్రకళ పాల్గొన్నారు.

ఎన్ఐసీకే ఇవ్వాలి

ఆర్వోఆర్ యాక్ట్ 2024 లో సవరణలు ప్రతిపాదిస్తూ రెవెన్యూ సిబ్బందికి శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని ఎస్టేట్ ఆఫీసర్ కే చంద్రకళ మంత్రి పొంగులేటి ని కోరారు. ప్రతి రెవెన్యూ రికార్డును డిజిటలైజేషన్ చేయాలని, భూమాత పోర్టల్ ని ప్రభుత్వం లేదా ఎన్ఐసీ మాత్రమే నిర్వహించాలని, ప్రైవేటు ఎజెన్సీకి ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పగించొద్దని సూచించారు. గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు.


Similar News