దూలపల్లి సహకార సొసైటీ బ్యాంకు లో నిధులు గోల్ మాల్

కంచె చేను మేస్తే కాపేమి చెయ్యగలడన్న చందంగా ఉంది దూలపల్లి సహకార సంఘం సొసైటీ చైర్మన్ పనితీరు.

Update: 2024-09-01 12:28 GMT

దిశ, దుండిగల్ : కంచె చేను మేస్తే కాపేమి చెయ్యగలడన్న చందంగా ఉంది దూలపల్లి సహకార సంఘం సొసైటీ చైర్మన్ పనితీరు. డైరెక్టర్లకు ఆదర్శవంతంగా ఉంటూ బాధ్యతాయుతంగా మెదులుతూ చేపట్టాల్సిన ఆ పదవికి అవినీతి మరకలు అంటించి పదవికి మచ్చ తెచ్చే విధంగా ఉంది. నిబంధనలు ఉల్లంగించి తన స్వార్థం కోసం ఇష్టానుసారంగా లోన్లు ఇచ్చి కోట్ల రూపాయల బ్యాంకు సొమ్ముకు గండిపడే విధంగా చేశాడని, జిల్లా సహకార సంఘం అధికారులు, పాలక మండలికి ఫైల్ నెంబర్ 01/2024 ప్రకారం ఎంక్వయిరీ సమన్లు జారీ చేశారు. దూలపల్లి పీఏసీఎస్ బ్యాంకు పాలక మండలికి అధికారులు నోటీసులు ఇవ్వడంతో చైర్మన్ గరిసే నరేందర్ రాజు అవినీతి బాగోతం బట్టబయలైంది. వెంటనే వివరణ ఇవ్వాలని చైర్మన్ తో పాటు 12 మంది సింగిల్ విండో డైరెక్టర్లకు, పాత పాలక మండలి డైరెక్టర్లకు సమన్లు అందడంతో డైరెక్టర్లు అయోమయానికి లోనవుతున్నారు.

పాలక వర్గానికి సమన్లు జారీ..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని దూలపల్లి (ప్యాక్స్) ప్రైమరీ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ టీబీసీ 395 సొసైటీ బ్యాంకులో కోట్ల రూపాయల ప్రజల సొమ్ము, బ్యాంకు నిధులు లోన్ల రూపంలో నిబంధనలకు విరుద్ధంగా, ఇష్ట రీతిగా ఇచ్చి భారీగా అవకతవకలు జరిగాయని, ఆడిట్లో మేడ్చల్ జిల్లా సహకార సంఘం అధికారులు గుర్తించారు. అవకతవకల పై వివరణ ఇవ్వాలని సొసైటీ చైర్మన్ గరిసె నరేంద్ర రాజుతో పాటు, 12 మంది డైరెక్టర్లకు, బ్యాంక్ అధికారులకు మేడ్చల్ జిల్లా సహకార సంఘం అసిస్టెంట్ రిజిస్టర్ నాగేశ్వర్ రావు ఆగస్టు 8వ తేదీన సమన్లు, నోటీసులు జారీ చేశారు. ఆగస్టు 27వ తారీఖు వరకు చైర్మన్ తో పాటు డైరెక్టర్లు అవకతవకల పై వివరణ ఇవ్వాలని కోరగా విస్మయానికి గురైన డైరెక్టర్లు తమకు తెలియదని, కొంతమంది అంత చైర్మన్ చూసుకుంటాడని విషయం బయటకి రానివ్వకుండా సమన్లు ఇచ్చి 20 రోజులు దాటినా కాలయాపన చేస్తున్నారు.

సహకార సంఘం ఏర్పాటు..

దూలపల్లి పీఏసీఎస్ 2003లో ఏర్పాటు అయ్యింది. అపుడు చైర్మన్ గా బూరుగుభావి సత్యనారాయణ ఉండగా 12 మంది డైరెక్టర్లు ఉన్నారు. తర్వాత మరో పాలకమండలి చైర్మన్ నవీన్ గుప్తా ఆధ్వర్యంలో 12 మంది డైరెక్టర్లు పాలకమండలి నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక 2019 లో నూతన పాలకవర్గం చెర్మన్ నరేందర్ రాజు, 12మంది సింగల్ విండో డైరెక్టర్లతో పాలక మండలి ఏర్పాటు అయ్యింది. ప్రజల ఆదరనతో అభివృద్ధి చెందిన సొసైటీ దాదాపు 50 నుంచి 100 కోట్ల టర్న్ ఓవర్ కు చేరింది. ఇదే అదునుగా భావించిన కొంత మంది అవినీతి సామ్రాట్లు పరిమితికి మించి లోన్లు తీసుకుని కట్టకుండా బకాయిలు పడ్డారు. ఈ కారణంగా బ్యాంకుకు గండి పడే విధంగా తయారు అయ్యిందని రైతులు వాపోతున్నారు.

నిబంధనల ప్రకారం (ఎల్ టి)లాంగ్ టర్మ్ లోన్ లు ఏవైనా ఆస్తిని మార్టిగేజ్ చేసుకుని పాలక మండలిలో ఉన్న సింగిల్ విండో డైరెక్టర్లు తీర్మానం ప్రకారం లోన్ లు అందించాలి. క్రాప్ లోన్ లు ఎకరాకు 40 వేలు చొప్పున రైతులకు ఎన్ని ఎకరాలు ఉంటే ఎలిజిబిలిటీ ప్రకారం లోన్ అందించాలి. నిబంధనలు తుంగలో తొక్కిన పాలక మండలి సభ్యులు తలా పాపం తిలా పిడికెడు అన్న చందంగా తయారై నిధుల గోల్ మాల్ కు శ్రీకారం చుట్టారు. మీటింగ్ లో డైరెక్టర్ లకు ఇచ్చే 5 వేల కవర్ కు ఆశ చూపి కోట్ల రూపాయలు కోళ్లగొట్టారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నిధులు గోల్ మాల్ వ్యవహారం బయటపడిందిలా..

దూలపల్లిలో కొంత మంది రైతులు తమకు లోన్ కావాలని దూలపల్లి ప్యాక్స్ సహకార బ్యాంకుకు వెళ్లగా నిధులు లేవని సీఈఓ సమాధానం ఇచ్చారు. 50 నుంచి 100 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న ఇంత పెద్ద బ్యాంకులో నిధులు లేకపోవటం ఏమిటని రైతులు నిలదీశారు. దీంతో అసలు విషయం బయట పడింది. బ్యాంకు సొసైటీ చైర్మన్ నిబంధనలకు విరుద్ధంగా కోట్ల రూపాయలు లోన్స్ తన మనుషులకు, బినామీలకు ఇచ్చారని అవి వసూల్ కావటం లేదని తెలిసింది.

అడ్డదారిలో నిధులు స్వాహా..

దూలపల్లి ప్యాక్స్ బ్యాంకులో ఛైర్మెన్ అవినీతికి పాల్పడాడ్డని, నిబంధనలు ప్రకారం వ్యవహారించాల్సిన చైర్మన్ తానే సొంతంగా ఖాతా నెంబర్118 తెరిచి లోన్ నెంబర్లు 29, 33, 30, 68, 80, 99, 352, 370 ల పై మొత్తం 8 లోన్లు 5 నుండి 6కోట్ల రూపాయలు లోన్స్ నిబంధనలు ఉల్లంగించి తీసుకున్నాడని అన్నారు. బకాయిలు చెల్లించడం లేదని ఇతనితో పాటు కొంతమంది డైరెక్టర్లు కూడా బకాయిలు ఉన్నారని అందుకే చైర్మన్ ను ప్రశ్నించడం లేదని తెలిపారు. బకాయలు పెరిగిపోవడంతో నిధుల కొరత ఏర్పడి సేవింగ్ అకౌంట్ దారులకు సైతం తమ డబ్బును విత్ డ్రా చేసుకోలేని పరిస్థితి నెలకొందని తెలిపారు. వెంటనే ఈ స్కాం పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జిల్లా సహకార సంఘం అధికారులకు రైతులు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన అప్పటి డీసీఒ రాజేందర్ రెడ్డి దూలపల్లి ప్యాక్స్ బ్యాంకు అవకతవకలను గుర్తించి డైరెక్టర్లకు, చైర్మన్ లకు సమన్లు జారీ చేశారు.

ఆడిట్ లో బట్ట బయలైన లోన్ల వ్యవహారం..

దూలపల్లి రైతుల ఫిర్యాదు మేరకు ఆడిట్లో విచారణ జరిపిన జిల్లా సహకార సంఘం అధికారులు పలు అంశాల పై విచారణ చేపట్టారు. ఫిక్స్ డిపాజిట్ల సేకరణలో ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం టీడీఎస్ వసూలు చేశారా..? పాలకమండలిలో తీర్మానం లేకుండా హౌసింగ్ లోన్స్, కార్ లోన్స్, బీజీనెస్ లోన్స్, ఎల్టీ లోన్స్, గోల్డ్ లోన్స్, పరిమితికి మించి ఎందుకు ఇచ్చారు. బైలాస్ ప్రకారం సొంత జిల్లా వారికి కాకుండా ఇతర జిల్లాల వారికి లోన్ ఎందుకు ఇచ్చారు, కో ఆపరేటివ్ సొసైటీ యాక్ట్ 54 ప్రకారం న్యాయ సలహా లేకుండా, మార్టిగేజ్ లేకుండా , నిబంధనలు ఉల్లంఘించి లోన్లు ఎందుకు ఇచ్చారు. ఆక్ట్ బి ప్రకారం నిబంధనలు ఉల్లంఘించి ఇచ్చిన 58 రుణాలు తిరిగి ఎందుకు వసూలు చేయలేదు. యాక్ట్ 3 ప్రకారం ఇచ్చిన 60 రుణాలలో బకాయి దారులు లోన్ చెల్లించకుంటే చట్టపరంగా ఎందుకు చర్యలు తీసుకోలేదు. సొసైటీ లో చైర్మన్ ఒక్కడే 8 రుణాలు తీసుకుంటే డైరెక్టర్లు ఎందుకు అడ్డుకోలేదు.

డైరెక్టర్లు సైతం లోన్ తీసుకొని చెల్లించకుంటే సొసైటీ సభ్యత్వానికి అనర్హులే అన్న విషయం మీకు తెలుసా లేదా, పాలకమండలి మీటింగ్లో 5వేలు కవర్ సిట్టింగ్ ఫీజ్ తీసుకోవడం నిబంధనలకు విరుద్ధం కాదా అంటూ ప్రశ్నిస్తూ డైరెక్టర్లకు, చైర్మన్ కు నియమావళి ఉల్లంఘన పై ఆగస్టు 8వ తేదీన సమన్లు జారీ చేశారు. దీంతో ఉలిక్కిపడిన పలువురు డైరెక్టర్లు బయటపడే దారిని వెతికే ప్రయత్నంలో పడ్డారు. దూలపల్లి ఫ్యాక్స్ లో జరిగిన లోన్ల భారీ స్కాంలో ఎవరి పాత్ర ఎంత ఉందనేది త్వరలో తేలనుంది. ఫిర్యాదుదారులు పేర్కొన్నట్టు ఛైర్మెన్ తీసుకున్నారా, తీసుకుంటే ఎంత చెల్లించారు, ఇంకా ఎంత చెల్లించాల్సి ఉంది, ఇక్కడి వారికి కాకుండా ఇతర జిల్లాలకు వారికి కూడా లోన్ ఇచ్చారా, చైర్మన్ తో పాటు మరో ప్యాక్స్ చైర్మన్ సైతం ఇక్కడి నుండి లోన్ పొందాడని, జిల్లా సహకార సంఘం అధికారి కూడా దూలపల్లి బ్యాంకు నుండి రుణం తీసుకున్నాడని, లోతుగా విచారణ జరిపి ప్రభుత్వ ప్రజల ఆస్తులు కాపాడాలని డిమాండ్ వినిపిస్తుంది.

విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం.. మేడ్చల్ జిల్లా డీసీఓ వెంకట్ రెడ్డి.

దూలపల్లి పాక్స్ లో జరిగిన లోన్లు గోల్ మాల్ పై డీసీఓ వెంకటరెడ్డిని వివరణ కోరగా తాను వచ్చి వారం రోజులు అవుతుందని రాగానే తమ విభాగంలో ఏసీబీ దాడులు జరిగి బిజీగా ఉన్నామన్నారు. దూలపల్లి స్కాం పై త్వరలో విచారణ జరుపుతామన్నారు. సొసైటీ ఆక్ట్ ప్రకారం ఎవరు తప్పు చేసినా, లోన్లు పొంది బకాయిలు చెల్లించకున్నా పైసాతో సహా వసూలు చేస్తామన్నారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని డీసీఓ వెంకటరెడ్డి తెలిపారు.


Similar News