జల దిగ్భంధంలో జన జీవనం...
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారి వర్షాలకు కూకట్పల్లి, మూసాపేట్ జంట సర్కిళ్ల పరిధిలో జన జీవనం జల దిగ్భంధంలో చిక్కుకుంది.
దిశ, కూకట్పల్లి : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారి వర్షాలకు కూకట్పల్లి, మూసాపేట్ జంట సర్కిళ్ల పరిధిలో జన జీవనం జల దిగ్భంధంలో చిక్కుకుంది. రహదారులన్ని జలమయం అయ్యాయి. నాలాలలో ఉదృతి పెరిగింది, కొట్టుకు వచ్చిన చెత్త చెదారాన్ని జీహెచ్ఎంసీ అధికారులు సకాలంలో తొలగించి కొన్ని కాలనీలు నీట మునగకుండా కాపాడారు. అదే విధంగా మూసాపేట్లోని మైసమ్మ చెరువు నిండి నాలా పొంగి సమీపంలోని రాజీవ్గాంధినగర్, సఫ్దర్నగర్ కాలనీలు జలమయం అయ్యాయి. కాలనీలలో మొకాళ్ల లోతు నీరు చేరడంతో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకున్నారు.
రాజీవ్గాంధీనగర్, సఫ్దర్నగర్ కాలనీలలో జోనల్ కమిషనర్ అపూర్వ్ చౌహాన్, కార్పొరేటర్ సబీహ బేగం, డీసీ రమేష్, ఈఈ శ్రీనివాస్, డీఈ ఆనంద్, ఏఈ రంజిత్లు పర్యటించారు. మైసమ్మ చెరువు సుందరీకరణ పనులలో భాగంగా కాముని చెరువు నుంచి మైసమ్మ చెరువుకు వచ్చే నాలాను చిన్న పైప్లు వేసి డైవర్ట్ చేయడంతో కాముని చెరువు నలా పొంగింది, దానికి తోడు మైసమ్మ చెరువులో వరద నీరు చేరి నీటి మట్టం పెరగడంతో చెరువులోని నీరు పక్కనే ఉన్న కాలనీలలో చేరింది. మూసాపేట్ ఇంజనీరింగ్ అధికారులు నాలాను జేసీబీల సహయంతో తవ్వి కాలనీలలో నీరు చేరకుండా చర్యలు తీసుకున్నారు. 48 గంటల పాటు వర్షసూచనలు ఉండటంతో సఫ్దర్నగర్లోని ప్రైవేటు పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్న ఏసీపీ శ్రీనివాస్రావు, సిఐ వెంకట్రెడ్డి, డీసీ రమేష్లు సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.