రోడ్డుపై నిలిచిన వర్షం నీరు

చెరువులను తలపిస్తున్న రోడ్లు ..

Update: 2024-09-26 03:48 GMT

దిశ, ఘట్కేసర్: ఘట్కేసర్ పట్టణ కేంద్రంలో ఏ సమయంలో రైల్వే ఫ్లైఓవర్ వంతెన నిర్మాణానికి ముహూర్తం పెట్టారో గాని.. 12 ఏళ్లకు పైగా ప్రజలు పట్టణంలో ప్రయాణం చేయాలంటే నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రజా ప్రతినిధులకు ఎవరికి కోపం వచ్చినా ప్రధాన రహదారిని మూసేస్తారు... దీంతో ప్రజలు గల్లీల రోడ్లను ఆశ్రయించాల్సి వస్తోంది. సంవత్సరం నుండి దూర ప్రాంతాల నుంచి రావలసిన బస్సులు పట్టణ కేంద్రంలోకి రావడమే మానేశాయి. పట్టణ శివారులోని నారాయణ గార్డెన్ పక్కనే ఉన్న నిఖిత వెంచర్ రోడ్డును రవాణాకు వినియోగిస్తున్నారు.

చిన్న చినుకు పడితే చాలు ఈ రోడ్డు అంతా చిత్తడై చెరువులను తలపిస్తోంది. భారీ గుంతలలో నుంచి ప్రయాణం నరకప్రాయంగా ఉందని వాహన చోదకులు వాపోతున్నారు. మున్సిపాలిటీ అధికారులు, ప్రజాప్రతినిధులు కనీసం ఈ రోడ్డునైనా మరమ్మత్తు చేయిస్తారంటే అడపాదడపా మట్టి పోయించి చేతులు దులుపుకుంటున్నారు. ఇటీవల ఘట్కేసర్ మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశంలో నిఖిత వెంచర్ లో రోడ్డు మరమ్మతులకు రూ.50 లక్షల బడ్జెట్ కేటాయించాలని తీర్మానం ప్రవేశపడితే కొందరు సభ్యులు వ్యతిరేకించారు. ప్రైవేట్ వెంచర్లో ప్రభుత్వ నిధులు ఎలా వినియోగిస్తారు అంటూ కమిషనర్ను, చైర్పర్సన్ ను నిలదీశారు.

ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తాత్కాలికంగా రోడ్డు మరమ్మతులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పినప్పటికీ కొందరు సభ్యులు తీర్మానానికి సహకరించకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. పట్టణ కేంద్రంలో ఫ్లైఓవర్ వంతెన నిర్మాణం జరుగుతుండగా ప్రత్యామ్నాయంగా రోడ్డు మార్గాన్ని చూపిస్తారా అంటే పట్టించుకునే వారే లేరని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా అవసరాల కోసం ప్రజాప్రతినిధుల మధ్య సఖ్యత లేకపోవడంతో పట్టణంలో ప్రధాన రహదారులు అస్తవ్యస్తంగా తయారయ్యాయని విమర్శలు వస్తున్నాయి. రైల్వే ఫ్లైఓవర్ వంతెన పూర్తవడానికి ఇంకా ఎంతకాలం పడుతుందో తెలియదు. అప్పటివరకు ఈ రోడ్డు సమస్య ఇలాగే ఉండాల్సిందేనా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు రోడ్డు విషయంలో సరైన నిర్ణయానికి రావాలని.. రైల్వే ఫ్లై ఓవర్ వంతెన నిర్మాణం పూర్తయ్యే వరకైనా ప్రత్యామ్నాయంగా సౌకర్యవంతమైన రోడ్డు మార్గం ఏర్పాటు కోసం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Tags:    

Similar News