చెరువులు, లే ఔట్లపై హైడ్రా కమిషనర్​ దృష్టి

పటాన్ చెరులో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు.

Update: 2024-08-31 10:11 GMT

దిశ,పటాన్ చెరు : పటాన్ చెరులో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. చెరువులు, కుంటలు, కాలువలతో పాటు లే ఔట్ స్థలాల ఆక్రమణలపై ఫిర్యాదులతో పాటు పత్రికలలో వచ్చిన కథనాలను ఆధారంగా చేసుకుని ఫిర్యాదులున్న వాటిని పరిశీలించారు. మొదట పటాన్ చెరు సాకి చెరువులో నిర్మాణాలను పరిశీలించి వాటికి సంబంధించిన అనుమతుల వివరాలను జీహెచ్ఎంసీ అధికారులకు అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి అమీన్ పూర్ లోని శంబుని కుంట, సంబి చెరువులను ఆయన సందర్శించారు. ఈ సంధర్బంగా చెరువులో కబ్జాలని పరిశీలించి ఇరిగేషన్ అధికారుల దగ్గర వివరాలను తీసుకున్నారు. అనంతరం వెంకటరమణ కాలనీ ప్లాటు ఓనర్ల ఫిర్యాదు మేరకు వెంకటరమణ కాలనీని పరిశీలించి ఆ కాలనీకి సంబంధించిన పార్కు స్థలాల వివరాలను ప్లాట్ ఓనర్లని అడిగి తెలుసుకున్నారు.

    గోల్డెన్ కీ నిర్మాణ సంస్థ పార్క్ తో పాటు స్కూల్ స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణాలు చేస్తున్నారని ప్లాట్ ఓనర్లు ఆయన దృష్టికి తీసుకుని వచ్చారు. తర్వాత వేదిరి టౌన్ షిప్ లోని కాలువలను పరిశీలించి హెచ్ ఎం టీ స్వర్ణ పూరి కాలనీ పక్కన పద్మావతి కాలనీ స్థలాన్ని పరిశీలించారు. తమ లే ఔట్ లోని 24 ఎకరాలను ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, సిస్టర్ రమేష్ అక్రమంగా కబ్జా చేసి మట్టితో నింపి ప్రహరీ గోడ నిర్మించారని కమిషనర్ రంగనాథ్ ఎదుట వాపోయారు. హాలీవుడ్ స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్ త్వరలో సర్వే నిర్వహించి బాధితులకు న్యాయం చేసేలా చూస్తానని హామీ ఇచ్చారు. సర్వేయర్ పకడ్బందీగా సర్వే నిర్వహించి ప్లాట్ ఓనర్లకు న్యాయం చేయాలని పక్కనే ఉన్న సర్వేయర్ బాలరాజు కు సూచించారు. ఆయన వెంట అమీన్ పూర్ తహసీల్దార్ రాధా, ఇరిగేషన్ డీఈఈ రామస్వామి, టీపీఓ పవన్, ఇరిగేషన్ ఏఈఈ సంతోషిణి, ఆర్ఐ రఘునాథ్ రెడ్డి తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News