సామాజిక బాధ్యతగా సీఎస్ఆర్ నిధులను అందజేయాలి: జిల్లా కలెక్టర్ రాజర్షి షా

జిల్లా సమగ్రాభివృద్ధిలో సామాజిక బాధ్యతగా ప్రతి పారిశ్రామిక సంస్థ తమ వార్షిక లాభాల్లో రెండు శాతం సీఎస్ఆర్ నిధులను అందజేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా కోరారు.

Update: 2023-03-17 10:26 GMT

దిశ, మెదక్ ప్రతినిధి: జిల్లా సమగ్రాభివృద్ధిలో సామాజిక బాధ్యతగా ప్రతి పారిశ్రామిక సంస్థ తమ వార్షిక లాభాల్లో రెండు శాతం సీఎస్ఆర్ నిధులను అందజేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా కోరారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు ప్రతిమసింగ్, రమేష్ తో కలిసి పారిశ్రామకవేత్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమల చట్టం ప్రకారం ప్రతి సంస్థ తమ వార్షిక లాభాల్లో రెండు శాతం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ క్రింద సామాజిక సేవా కార్యక్రమాలకు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు.

మన జిల్లాలో కొన్ని చిన్న పారిశ్రామికవేత్తలు కూడా సామాజిక, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం అభినందించదగిన విషయమన్నారు. అదేవిధంగా చాలామంది పారిశ్రామిక వేత్తలు జిల్లా యంత్రాంగానికి సరైన సమాచారం ఇవ్వకుండా ప్రాధాన్యత లేని పనులకు సీఎస్ఆర్ నిధులు ఖర్చు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. దీంతో అత్యవసర ప్రజావసర పనులను చేపట్టలేకపోతున్నామని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మనఊరు.. మన బడి, హరితహారం కార్యక్రమాలకు నిధుల కొరత లేదని, అలాంటి కార్యక్రమాలకు కొందరు పారిశ్రామిక వేత్తలు నిధులు ఖర్చు చేస్తున్నారని తెలిపారు.

పారిశ్రామికవేత్తలు తమ సీఎస్ఆర్ నిధులలో 30 నుంచి 40 శాతం మేర స్థానిక అవసరాల నిమిత్తం, ప్రజాప్రతినిధుల కోరిక మేరకు ఖర్చు చేసినా.. మిగతా 60 శాతం సీఎస్ఆర్ ఫండ్ కు బదలాయిస్తే జిల్లాలో ఏ ప్రాంతంలో అత్యవసర పనులు చేపట్టాలో గుర్తించేందుకు వీలవుతోందని పేర్కొన్నారు. ఈ సీఎస్ఆర్ ఫండ్స్ మానిటరింగ్ చేసేందుకు జిల్లాలో ముఖ్య ప్రణాళికాధికారిని నోడల్ అధికారిగా ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. తద్వారా బడుగు, బలహీనవర్గాల సంక్షేమానికి, ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలో మరమ్మతులు, మురుగు కాలువల నిర్మాణం, కళాశాలల్లో ఫర్నీచర్ ఏర్పాటు నిధులు ఉపయోగపడతాయని తెలిపారు.

డబుల్ బెడ్ రూం ఇళ్ల సముదాయంలో మంచి నీటి సౌకర్యం, విద్యుత్ వంటి మౌలిక వసతులు, మాతా, శిశు సంరక్షణ కేంద్రంలో అటెండంట్స్ కు షెడ్ల ఏర్పాటు, పర్యావరణ పరిరక్షణ, అటవీ ఆధారిత కార్యక్రమాలు చేపట్టేందుకు, ప్రమాద బాధితులకు ఆర్ధిక సాయం అందించేందుకు వీలుంటుందన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల అధికారి కృష్ణ మూర్తి, మహమ్మద్ కాసిం, ఫారెస్ట్ ప్లస్ ప్రాంతీయ అధికారి సాయిలు, జిల్లాలోని వివిధ పారిశ్రామికవేత్తలు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News