పండగ పూట మహిళలకు తప్పని నీటి కష్టాలు

తెలంగాణ రాష్ట్రంలోని మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి నల్లాల ద్వారా తాగునీరు అందించడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం పుట్టింది. ..

Update: 2024-08-19 06:35 GMT

దిశ, తలకొండపల్లి: తెలంగాణ రాష్ట్రంలోని మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి నల్లాల ద్వారా తాగునీరు అందించడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం పుట్టింది. కానీ మిషన్ భగీరథ పథకంలోని గ్రిడ్డు అధికారుల నిర్లక్ష్యంతో కల్వకుర్తి నియోజకవర్గంతో పాటు, షాద్‌గర్ , వికారాబాద్, కోడంగల్, శంషాబాద్ ,కందుకూరు , మహేశ్వరం మండలాలతో పాటు మరికొన్ని మండలాలకు తాగునీటి ఇబ్బంది తలెత్తినట్లు తెలుస్తుంది.

మూడు రోజులుగా నీటి సరఫరా బంద్ కావడంతో మహిళలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రీశైలం రిజర్వాయర్ నుండి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని తాడూర్ మండలంలోని అలిపూర్ వద్ద మెయిన్ పైప్ లైన్ లీకేజీ కారణంగా భగీరథ నీటీ సరఫరాకు అంతరాయం జరిగినట్లుగా అధికారులు సూచిస్తున్నారు. తాడూర్ మండలంలోని అలిపూర్ వద్ద లీకేజీ జరుగుతున్న విషయం అధికారులకు ముందుగానే తెలుసు, లీకేజీ జరుగుతున్నప్పుడు మరమ్మతులు చేపడితే రెండు మూడు రోజుల పాటు పట్టణాలకు, మున్సిపాలిటీలకు, గ్రామాలకు నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని ముందుగా అధికారులకు తెలిసి కూడా జాగ్రత్తలు తీసుకోవడంలో పూర్తిగా విఫలం చెందారు. ప్రతి మండల కేంద్రంలోని ఎంపీడీవో స్థాయి అధికారులకు సమాచారం అందించి, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి గ్రామంలో పంచాయితీ సెక్రటరీలకు సమాచారం చేరవేసి అందుబాటులో ఉన్న మోటార్ల ద్వారా ఓ హెచ్ఎస్ఆర్ ట్యాంకులు నింపుకోవాలని సూచించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ప్రజలు ,మహిళలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చేసే తప్పిదాల వల్ల ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేసినా చెడ్డ పేరు రావడం ఖాయంగా మారింది.

ఏది ఏమైనా గత మూడు రోజులుగా గ్రామాలలో తాగినీటికి ఇబ్బందులు రావడంతో పాటు రాఖీ పండుగ వేళ మహిళలకు మరింత నీటి సమస్య తలెత్తడంతో స్థానిక అధికారులు, పంచాయితీ కార్మికులపై మహిళలు పలు గ్రామాలలో చూటి పోటి మాటలు మాట్లాడుతూ ఘర్షణకు దిగుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నత అధికారులు మరోసారి ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా చూసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. మిషన్ భగీరథ పథకంలోని గ్రిడ్డు ఏఈ చేతన్ ను దిశ వివరణ కోరగా మేము ఎంపీడీవోలకు, పంచాయతీ సెక్రటరీలకు నీటి సరఫరాలో అంతరాయం జరుగుతుందని ముందుగానే సమాచారం ఇచ్చామని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని తలకొండపల్లి ఎంపీడీవో శ్రీకాంత్ ను వివరణ కోరగా మిషన్ భగీరథ అధికారుల నుండి మాకు ఎలాంటి సమాచారం లేదని మాకు ముందుగా సమాచారం ఇచ్చి ఉంటే గ్రామాలలో మేము త్రాగునీటి ఇబ్బందులు రాకుండా చూసుకునేవారమని పేర్కొన్నారు. సంబంధిత గ్రిడ్డు అధికారులను నీటి సరఫరా ఎప్పటి వరకు జరుగుతుందని పలువురు ఫోన్లో సంప్రదించగా ఎప్పటి వరకు మరమ్మతు పనులు పూర్తయి నీరు వస్తుందో వారికే స్పష్టత లేదు అని పలువురు చర్చించుకుంటున్నారు. రాఖి పండగ పూట చుక్కాపూర్ గ్రామంలోని మహిళల త్రాగునీటి ఇబ్బందులను తీర్చడానికి గ్రామపంచాయతీ ట్యాంకర్ ద్వారా ఇంటింటికి నీటిని తరఫున చేస్తున్న పంచాయతీ కార్మికులు.

Tags:    

Similar News