పూజల కోసం సమాధిలోకి వెళ్లిన స్వామిజీ.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్..!

నేను పూజల కోసం సమాధిలోకి వెళుతున్నాను.. ఐదు రోజుల తర్వాత తిరిగి వస్తాను.. అప్పటివరకు మీరు ఈ ఐదు రోజులు అఖండ

Update: 2024-07-07 13:21 GMT

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: నేను పూజల కోసం సమాధిలోకి వెళుతున్నాను.. ఐదు రోజుల తర్వాత తిరిగి వస్తాను.. అప్పటివరకు మీరు ఈ ఐదు రోజులు అఖండ భజనలు చేయండి అని చెప్పి సమాధిలోకి వెళ్లిన వీరబ్రహ్మేంద్రస్వామి భక్తుడికి సంబంధించిన సంఘటన ఆదివారం నారాయణపేట జిల్లా మద్దూరు మండలం రేణివట్ల గ్రామంలో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే.. మొదటినుండి వీరబ్రహ్మేంద్రస్వామి భక్తుడిగా ఉంటూ వచ్చిన రేణిగుంట్ల గ్రామానికి చెందిన హనుమంతు అలియాస్ శ్రీశ్రీశ్రీ సద్గురు సత్యానంద హనుమంతు స్వామి భార్య గత ఏడాది వ్యవసాయపల్లి వద్ద ఎద్దు పొడవడంతో మృతి చెందింది. అక్కడే భార్యకు సమాధి కట్టించాడు. అక్కడే ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని పూర్తిస్థాయిలో సద్గురు సత్యానంద హనుమంతు స్వామిగా పేరు మార్చుకొని పూజలు చేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో ఆయనకు మండల పరిధిలోని ఆయా గ్రామాలతో పాటు, కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారు కూడా పెద్ద ఎత్తున భక్తులుగా మారారు.

ఈ క్రమంలో ఆయన సమాధిలోకి వెళ్లి ఐదు రోజులపాటు పూజలు చేసి.. తిరిగి వస్తాను.. అప్పటివరకు మీరు అఖండ భజనలు చేయాలని తన భక్తులను కోరి ఈనెల 5వ తేదీన మధ్యాహ్నం అమావాస్య రోజు సమాధిలోకి వెళ్ళాడు. లోపల ఉండి పూజలు చేస్తూ ఉండగా.. భక్తులు ఆ సమాధిని తెరవకుండా మూసి ఉంచి అఖండ భజనలు చేస్తూ వచ్చారు. ఈ విషయము బయటపడకుండా భక్తులు జాగ్రత్త పడినప్పటికిని ఆదివారం ఉదయం పోలీసులకు సమాచారం అందడంతో డీఎస్పీ లింగయ్య, ఎస్ఐలు రామ్ లాల్, వెంకటేశ్వర్లు, రాజు ఆధ్వర్యంలో పోలీసులు ఆదివారం సంఘటన స్థలానికి చేరుకొని భక్తులకు నచ్చజెప్పి.. సమాధిలో ఉన్న సద్గురు సత్యానంద హనుమంతు స్వామివారిని బయటకు రప్పించారు. ఈ సందర్భంగా స్వామీజీ ఈ విషయాన్ని బహిర్గతం చేసిన వారి పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్పీ స్వామివారికి నచ్చ చెప్పి పూజా కార్యక్రమాలను బయట ఉండి కొనసాగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై పోలీసులు, స్వామీజీ, భక్తుల మధ్య ఇంకా చర్చలు జరుగుతున్నాయి.


Similar News