ఆగని వీధికుక్కల దాడులు.. గద్వాల జిల్లాలో బాలుడిపై విరుచుకుపడిన శునకాలు

వీధికుక్కల దాడిలో మరో బాలుడు తీవ్రగాయాల పాలయ్యాడు. జోగులాంబ గద్వాల జిల్లాలో రేవంత్ అనే బాలుడిపై వీధికుక్కలు విరుచుకుపడ్డాయి.

Update: 2024-10-04 03:52 GMT

దిశ, అలంపూర్ : రాష్ట్ర వ్యాప్తంగా వీధి కుక్కల దాడులు ఆగడం లేదు. ఒంటరిగా కనిపించే చిన్నారులపై శునకాలు విరుచుకుపడుతున్నాయి. మూకుమ్మడి దాడులతో మనుషుల ప్రాణాలను తీస్తున్నాయి. వీధి కుక్కల దాడులపై ఒకవైపు ప్రజల నుంచి ఆందోళన వ్యక్తం అవుతున్నా.. అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.

తాజాగా జోగులాంబ గద్వాల జిల్లాలో ఓ బాలుడిపై వీధికుక్కలు దాడి చేశాయి. శుక్రవారం ఉదయం మానవపాడు మండల పరిధిలోని అమరవాయి గ్రామానికి చెందిన రేవంత్(6) అనే బాలుడు కుక్కల దాడిలో తీవ్రగాయాల పాలయ్యాడు. బోయ పరశురాముడు-శిరీష దంపతుల కొడుకు రేవంత్.. ఉదయాన్నే ఇంటిముందు ఆడుకుంటున్నాడు. అంతలో తల్లి శిరీష పాలప్యాకెట్ తీసుకురావాలని చెప్పగా.. షాపుకు వెళ్లాడు. ఈ క్రమంలోనే రేవంత్ పై వీధికుక్కలు దాడి చేసి.. తీవ్రంగా గాయపరిచాయి.

రేవంత్ కనురెప్పలు, చేతులు, తలపై గాయపరిచాయి. రేవంత్ అరుపులు విన్న తల్లిదండ్రులు, స్థానికులు అక్కడికి పరుగున చేరుకుని కుక్కల్ని తరిమికొట్టారు. బాలుడిని కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు చికిత్స చేస్తున్నారు. వీధికుక్కల బెడద ఎక్కువైందని, వాటిని కట్టడి చేయాలని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు.


Similar News