తీవ్ర విషాదం.. ఇంటి గోడకూలి తల్లి, కూతురు మృతి

గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నారాయణపేట జిల్లా, కొత్తపల్లి మండలం ఎక్కమేడు గ్రామంలో విషాదం నెలకొంది.

Update: 2024-09-01 02:54 GMT

దిశ, కొత్తపల్లి : గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నారాయణపేట జిల్లా, కొత్తపల్లి మండలం ఎక్కమేడు గ్రామంలో విషాదం నెలకొంది. ఆదివారం తెల్లవారుజామున ఇల్లు కూలిన ఘటనలో తల్లి, కూతురు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమమ్మ (78) కు ముగ్గురు కూతుళ్లు, ఓ కుమారుడు ఉండగా అందరికీ వివాహాలు జరిగాయి. కుమారుడు, కోడలు మరో ఇంట్లో ఉంటుండగా హనుమమ్మ, భర్త చనిపోయిన తన రెండో కూతురు అంజులమ్మ (38) తో కలిసి తన ఇంట్లో నివాసం ఉంటుంది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఆదివారం తెల్లవారుజామున ఇల్లు కూలిపోయింది. దీంతో నిద్రలో ఉన్న తల్లి కూతుళ్లు ఇద్దరు మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే తహసీల్దార్ అనిల్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. వర్షాలు భారీగా కురుస్తున్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


Similar News