మెగా జాబ్ మేళా విజయవంతం.. పాల్గొన్న 68 కంపెనీలు
మంగళవారం కల్వకుర్తి పట్టణంలోని సీకేఆర్ ఫంక్షన్ హాల్ లో ఐక్యత

దిశ, కల్వకుర్తి : మంగళవారం కల్వకుర్తి పట్టణంలోని సీకేఆర్ ఫంక్షన్ హాల్ లో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. అదే క్రమంలో ఐక్యత ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు కృష్ణారెడ్డి, సుభాషిణి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ జాబ్ మేళాకు 2500 నిరుద్యోగులు హాజరుకాగా 68 కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించి 230 మంది యువతీ, యువకులకు ఉద్యోగాలు కల్పించాయి. ఈ సందర్భంగా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ... నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పనే ధ్యేయంగా ముందుకువెళ్తున్నామని, దాదాపు పదివేల మందికి పైగా యువతకు ఉద్యోగాల అవకాశాలు అందించేందుకు ప్రతి దినం పని చేస్తున్నామని ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో నియోజకవర్గ నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఐక్యత ఫౌండేషన్ పనిచేస్తుందన్నారు. గతంలో జాబ్ మేళాలు నిర్వహించి చాలామంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించామని సుంకిరెడ్డి అన్నారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులందరికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
కల్వకుర్తి నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో ఈ మెగా జాబ్ మేళ నిర్వహించి యువతకు ఉపాధి కల్పిస్తున్నామని ఆయన అన్నారు. యువత తమకు అందిన అవకాశాలను అనుకూలంగా మార్చుకుని ఉద్యోగాల్లో రాణించాలన్నారు. కష్టపడి పనిచేయడం అనేది ఒక అలవాటుగా మార్చుకోవాలని, ఏ ప్రాంతంలో అయినా పని చేసేందుకు సిద్ధంగా ఉండాలని టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి తెలిపారు. యువత ఖాళీగా ఉండకుండా తన విద్యార్హతకు తగిన ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా వచ్చిన ఉద్యోగంలో ప్రతిభ కనబర్చడం ద్వారా యువత అనుకున్న లక్ష్యాలను సాధించడం సులభం అవుతుందని సుంకిరెడ్డి అన్నారు. జాబ్ మేళాలో ఎంపికైన యువతీ, యువకులకు ఇంటర్వ్యూలు నిర్వహించిన కంపెనీలు విద్యార్హతను బట్టి తమ సంస్థల్లో పని చేసేందుకు ఎంపికైన 230 మందికి ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐక్యత ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు కృష్ణారెడ్డి, సుభాషిణి, ఐక్యత ఫౌండేషన్ సభ్యులతో పాటు తదితరులు పాల్గొన్నారు.