పాలమూరుకు చేరిన ‘హైడ్రా’.. ఆక్రమణల కూల్చివేతలకు రంగం సిద్ధం!

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతల పర్వం పాలమూరుకు చేరింది.

Update: 2024-09-26 02:01 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతల పర్వం పాలమూరుకు చేరింది. హైడ్రాపై కొందరు హర్షం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు విమర్శలు చేస్తున్నారు. అయితే, సర్కార్ మాత్రం హైదరాబాద్ లాంటి వ్యవస్థను జిల్లాలకు కూడా విస్తరించాలని భావించింది. ఇటీవల జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆక్రమణలకు గురైన చెరువులు, కుంటలు, నాలాల వివరాలను సిద్ధం చేయాలని సీఎం మౌఖిక ఆదేశాలిచ్చారు. సీఎం ఆదేశాలతో కలెక్టర్ విజయేంద్ర బోయి జిల్లా కేంద్రంలోని అన్ని చెరువులు, కుంటలు, నాలాల వివరాలు, ఆయకట్టు వివరాలను మున్సిపల్, నీటి పారుదల శాఖ అధికారుల నుంచి తెప్పించుకున్నట్లు సమాచారం. ఇందులో అనేక అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించి మొదటి జాబితా కింద 213 మంది గృహ యజమానులకు నోటీసులు జారీ చేశారు. చెరువులు, నాలాలు, కుంటల సమీపంలో తెలిసో, తెలియకో ఇండ్లు నిర్మించుకున్న పాలమూరు ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏ ఇళ్లు బఫర్ జోన్లో ఉందో, ఏ ఇళ్లు ఎఫ్టీఎల్ పరిధిలో ఉందో తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

పెద్ద చెరువులో ఆక్రమణల జోరు..

ముఖ్యంగా పాలమూరులోని పెద్ద చెరువులో పెద్ద ఎత్తున ఆక్రమణలు జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. 96.11ఎకరాల్లో విస్తరించి ఉన్న పెద్ద చెరువు కింద 200 ఎకరాలకుపైగా ఆయకట్టు ఉంది. పట్టణం విస్తరిస్తున్న నేపథ్యంలో 1989 నుంచి చెరువు ఆక్రమణకు గురవుతూ వచ్చింది. అందులో 40 ఎకరాల చెరువును 64 మంది ఆక్రమించినట్లు అధికారుల దగ్గర సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు సగానికి పైగా చెరువు కబ్జాకు గురైనట్లు గుర్తించారు. అలాగే కొత్త చెరువు, ఏనుగొండలోని మాదిగకుంట, మంగలికుంట, ఎస్ఆర్ కుంట చెరువు, శ్రీనివాస కాలనీ చెరువు, పాలకొండ చెరువు, మయూరి పార్కు దగ్గర ఉన్న చెరువు ఇలా పట్టణంలోని అన్ని చెరువులు ఆక్రమణలకు గురైనట్లుగా అధికారులు గుర్తించి నివేదికను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

స్పష్టత ఇవ్వని అధికారులు..

పెద్ద చెరువు నుంచి నాలాలు వెలిశాయి. అయితే కొద్ది రోజుల క్రితం పెద్ద చెరువు ఇరువైపుల ఉన్న ఇళ్లు బఫర్ జోన్ లో ఉన్నాయని మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇందులో కూడా అధికారులు స్పష్టత ఇవ్వక పోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి ఎఫ్టీఎల్ అంటే చెరువులో నీళ్లు ఆగే స్థలంలో నిర్మాణాలు జరిగితే వాటిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే బఫర్ జోన్ అంటే చెరువుల నుంచి నాలాల ద్వారా నీరు స్వేచ్ఛగా వెళ్లేలా ఉండాలి. ఆ మేరకు ఆ పరిధిలో ఆక్రమణలు జరిగితే కూల్చివేయాల్సి ఉంటుంది. ఏవీ బఫర్ జోనో? ఏది ఎఫ్టీఎల్ లో ఉందో అర్థం కాని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. తెలిసో, తెలియకో లక్షల రూపాయలు అప్పు చేసి ఇళ్లు నిర్మించుకున్నామని, హైడ్రా పేరుతో కూల్చివేస్తే తమ బతుకులు ఏం కావాలని ప్రజలు వాపోతున్నారు.

నాలా పక్కన వాణిజ్య భవనం సంగతి ఏంటి

ఒక వైపు పేద ప్రజలకు నోటీసులు జారీ చేసిన అధికారులు మైత్రి నగర్ లోని పాత పాలమూరు దగ్గర భూత్పూర్ వెళ్లే రహదారిలో పెద్ద చెరువు నాలా పక్కన నిర్మిస్తున్న ప్రముఖ వాణిజ్య సంస్థకు ఇరిగేషన్ అధికారులు ఎన్టీసీ ఇచ్చినట్లు సమాచారం. నాలా (బఫర్ జోన్) పక్కనే వాణిజ్య భవనం నిర్మిస్తుంటే అధికారులు ఎందుకు నోటీసులు జారీ చేయలేదని, ఇందులో మతలబు ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. పేద వారికి ఒక న్యాయం, డబ్బున్న వారికి ఒక న్యాయమా అంటూ వారు నిలదీస్తున్నారు.

పాలమూరులో హైటెన్షన్..

అధికారులు నోటీసులు జారీ చేయడంతో ఇండ్ల యజమానులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు, రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్లి మొర పెట్టుకుంటున్నారు. తాము ఎప్పుడో లక్షలు అప్పులు చేసి ఇళ్ల నిర్మాణాలు చేసుకున్నామని, ఇప్పుడు వచ్చి బఫర్ జోన్‌లో ఉందంటూ అధికారులు హల్ చల్ చేస్తున్నారని వాపోతున్నారు. దాదాపు వెయ్యి ఇళ్లకు నోటీసులు సిద్ధం చేస్తున్నట్లు, వీటిలో దాదాపు 75 శాతం పేద మధ్య తరగతి ప్రజలు నిర్మించుకున్న ఇళ్లే ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే కూల్చివేతలు ప్రారంభం కావచ్చునని తెలుస్తోంది. ఎంతో కష్టపడి నిర్మించుకున్న ఇళ్లను కూల్చితే తమ భవిష్యత్ ఏంటని మదన పడుతున్నారు.


Similar News