బువ్వ బాగోలేదంటే చితకబాదారు

సద్ది బువ్వ వద్దమ్మా మెత్తగై వాసన వస్తుందని ఓ తండ్రి చెప్పడంతో... కొడుకు, కోడళ్ళు కట్టెలతో చితకబాదిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల పరిధిలోని జల్లాపురం గ్రామంలో వెలుగు చూసింది.

Update: 2024-10-24 11:03 GMT

దిశ, అలంపూర్ : సద్ది బువ్వ వద్దమ్మా మెత్తగై వాసన వస్తుందని ఓ తండ్రి చెప్పడంతో... కొడుకు, కోడళ్ళు కట్టెలతో చితకబాదిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల పరిధిలోని జల్లాపురం గ్రామంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే... జల్లాపురం గ్రామానికి చెందిన గుర్రం బండి నాయక కృష్ణయ్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఏడాది క్రితం ఉన్న పొలాన్ని మొత్తం అమ్మి వచ్చిన డబ్బును కొడుకులకు సమానంగా పంచిపెట్టాడు. గుర్రం బండి నడుపుకుంటూ వచ్చిన డబ్బులతో తన ఇంట్లోనే జీవనం చేస్తూ కొడుకుల దగ్గరే ఉంటున్నాడు. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో కోడలు అన్నం పెట్టి తినమని చెప్పింది. అన్నం బాగోలేదని నీళ్లు నీళ్లు ఉండి వాసన వస్తుందని చెప్పడంతో తన కొడుకు కోడలు ఇష్టం వచ్చినట్లు చితక బాదినట్లు వాపోయాడు. కొడుకు కోడలు చితకబాదడం... ఇంట్లో ఉంటే చంపుతారని భయంతో

నడుచుకుంటూ అర్ధరాత్రి మానవపాడు స్టేషన్కు చేరుకున్నాడు. రాత్రి స్టేషన్ ముందు వచ్చి కేకలు వేసిన ఎవరూ కూడా పట్టించుకోలేదని, అక్కడే కుర్చీలపైన నిద్రించినట్లు తెలిపారు. తెల్లవారుజామున పోలీసులు చూసి...ఈ టైంలో ఎందుకు వచ్చావని, ఉదయం 9 తర్వాత ఎస్సై వస్తే నీ బాధ చెప్పుకో అని వెళ్లిపోమన్నారని అన్నారు. గతంలో వచ్చిన ఇదే మాట అన్నారని వాపోయాడు. నా ఇంట్లో నన్ను ఉండటానికి అవకాశం కల్పిస్తే నా జీవితం నేను జీవిస్తానని, నా కొడుకులు అన్నం పెట్టకపోయినా అడుక్కునైన తింటానని చెప్పిన సంఘటన స్థానిక టీ హోటల్ దగ్గర కంటతడి పెట్టించింది. ఈ విషయంపై ఎస్ఐ ను వివరణ కోరగా... పోలీస్ స్టేషన్కు ఎవరు వచ్చిన ఫిర్యాదులు తీసుకుంటామని, సమస్య ఏదో కూడా తెలుసుకొని న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని ఎస్సై చంద్రకాంత్ తెలిపారు. నాయక కృష్ణయ్య ఫిర్యాదు మేరకు కేసు కూడా నమోదు చేసినట్లు తెలిపారు. కొట్టిన ఆ ఇద్దరు కుమారులు పై కేసు నమోదు అయినట్లు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు తెలిపారు.


Similar News